1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (10:34 IST)

ఇటలీలో కరోనాతో 150మంది వైద్యుల మృతి.. అమెరికాలో 51వేలకు పెరిగింది..

ఇటలీలో కరోనా వైరస్ కారణంగా 150మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇటాలియన్ అసోసియేషన్ ఆఫ్ డాక్టర్స్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా నమోదు అయిన వైరస్ కేసుల్లో పది శాతం మంది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నట్లు ఆ సంఘం పేర్కొంది. అయితే తాజాగా అక్కడ ప్రభుత్వం .. డాక్టర్ల రక్షణ కోసం ఓ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిపై మరో డాక్టర్ల సంఘం నిరసన వ్యక్తం చేసింది. 
 
వైద్యశాఖకు కేటాయించిన 25 బిలియన్ల యూరోలు ఏమాత్రం సరిపోవు అని కొందరు డాక్టర్లు ఆరోపిస్తున్నారు. కరోనా వేళ పేషెంట్లు సునామీలా హాస్పటిళ్లకు వచ్చారని, ఇప్పటికే హెల్త్ కేర్ వ్యవస్థకు నిధులు సరిగా అందడంలేదని వైద్యులు విమర్శిస్తున్నారు. 
 
మరోవైపు కోవిడ్‌-19 మహమ్మారి అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇక్కడే మూడో వంతు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య నాలుగో వంతుగా ఉంది. గతేడాది నవంబర్‌లో చైనాలోని వుహాన్‌లో పుట్టుకొచ్చిన ఈ వైరస్‌ ఇప్పటివరకు సుమారు 1,95,000 మందిని పొట్టనపెట్టుకుంది. 27 లక్షల మందిని బాధితులుగా మార్చింది. ఇక అమెరికాలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 9.2 లక్షలు దాటింది. మృతుల సంఖ్య 51 వేలకు పెరిగింది.