గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (18:02 IST)

ఎయిమ్స్‌లో కంపౌడర్‌కు కరోనా - సెల్ఫ్ క్వారంటైన్‌కు వైద్యులు

దేశంలోనే అత్యున్నతమైన వైద్య సంస్థ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో పని చేసే ఓ కంపౌండర్‌కు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అతని వార్డులో పని చేసే 40 మంది వైద్యులతో పాటు ఇతర వైద్య సిబ్బంది సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. 
 
మరోవైపు సదరు కంపౌండర్‌ పని చేసే వార్డులోని రోగుల శాంపిళ్లను కూడా సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపారు. వీరిలో ఇప్పటివరకు 22 మంది రిపోర్టులు రాగా... అందరికీ నెగెటివ్ అని తేలింది. మిగిలిన వారి రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు.
 
కరోనా బారిన పడిన కంపౌండర్‌కు తనకు జ్వరంగా ఉందంటూ గత శనివారం ఫోన్ ద్వారా వైద్యులను సంప్రదించాడు. సోమవారం ఆస్పత్రికి వచ్చి టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. 
 
సోమవారం డ్యూటీ ఉండటంతో... బుధవారం టెస్టులు చేయించుకున్నాడు. కరోనా సోకినట్టు అదే రోజు రాత్రి రిపోర్టు వచ్చింది. మరుసటి రోజు (గురువారం) ఈ విషయం అందరికీ తెలిసింది. 
 
ప్రస్తుతం అతను ఎయిమ్స్‌లోనే చికిత్స పొందుతున్నాడు. అతనికి కరోనా సోకడంతో... అతను పని చేస్తున్న గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలోని మొత్తం సిబ్బందిని సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో, వారంతా క్వారంటైన్ కు వెళ్లారు.