శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2020 (13:13 IST)

శాంతించని కరోనా.. కొత్తగా 69 వేల పాజిటివ్ కేసులు - తెలంగాణాలో లక్ష క్రాస్

దేశంలో కరోనా వైరస్ ఏమాత్రం శాంతించడం లేదు. దేశంలో కొత్తగా మరో 69878 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఈ కేసులు నమోదయ్యాయి. అలాగే, 945 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 29,75,702కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 55,794కి పెరిగింది. ఇక 6,97,330 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 22,22,578 మంది కోలుకున్నారు.
 
కాగా, నిన్నటి వరకు మొత్తం 3,44,91,073 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,23,836 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు లక్ష దాటాయి. కొత్తగా 2,474  మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. అదేసమయంలో ఏడుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,768 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,865కి చేరింది. ఆసుపత్రుల్లో 22,386 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 78,735 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 744కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 447 మందికి కొత్తగా కరోనా సోకింది.