1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (13:49 IST)

జికా వైరస్ దెబ్బకు వణికిపోతున్న ఉత్తరప్రదేశ్ - 106 పెరిగిన కేసులు

కరోనా వైరస్ కాస్త శాంతించినట్టు కనపిస్తుంది. కానీ, జికా వైరస్ మాత్రం చాపకింద నీరులా మెల్లగా విస్తరిస్తుంది. తొలుత కేరళ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ జికా వైరస్.. ఇపుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 16 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే యూపీలో మొత్తం జికా కేసుల సంఖ్య 106కు పెరిగాయి. కొత్తగా వైరస్ బారిన పడిన వారిలో తొమ్మిది మంది పురుషులు, ఏడుగురు మహిళలు, ఇద్దరు గర్భిణులు ఉండటం గమనార్హం. 
 
అయితే, రాష్ట్రంలో జికా వైరస్ కేసుల సంఖ్య పెరగతుండటంపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నీపాల్ సింగ్ మాట్లాడుతూ... కొత్తగా వైరస్ బారిన పడిన 16 మంది కాన్పూర్ లోని హర్జీందర్ నగర్, పోఖార్ పూర్, తివారీపూర్ బగియా, క్వాజీ ఖేరా ప్రాంతాలకు చెందిన వారని చెప్పారు. 
 
వైరస్ బారిన పడిన గర్భిణులకు వైద్యులు అల్ట్రాసౌండ్ టెస్టులు నిర్వహించారని... ఇద్దరి గర్భాల్లోని పిండాలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు. జికా వ్యాప్తి నేపథ్యంలో కాన్పూర్ లో 100 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. హోం శాంపిల్స్‌ను సేకరించేందుకు వీలుగా 15 వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 
 
జికా వ్యాప్తిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు 15 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ లను రంగంలోకి దించారు. జికా బారిన పడిన వారిలో అత్యధికులు అసింప్టొమేటిక్ అని వైద్యాధికారులు తెలిపారు. వైరస్ నేపథ్యంలో డోర్ టు డోర్ సర్వే, శాంప్లింగ్ చేస్తున్నామని వెల్లడించారు.