గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 జులై 2021 (06:55 IST)

లంకతో తొలి ట్వంటీ20 సమరం : భారత్ విజయం

శ్రీలంక పర్యటనలో ఉన్న యంగ్ ఇండియా జట్టు మరోమారు శుభారంభం చేసింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గత రాత్రి శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ శుభారంభం చేసింది. ఆతిథ్య జట్టును 38 పరుగుల తేడాతో మట్టికరిపించి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్దేశించిన 165 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ భువనేశ్వర్ దారుణంగా దెబ్బకొట్టాడు. కీలకమైన నాలుగు వికెట్లు తీసి శ్రీలంక బ్యాటింగ్‌ను కుప్పకూల్చాడు. 
 
ఫలితంగా ఆ జట్టు మరో 9 బంతులు మిగిలి ఉండగా 126 పరుగులకే ఆలౌటై ఓటమి చవిచూసింది. దీపక్ చాహర్ రెండు వికెట్లు తీసుకోగా, కృనాల్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా తలా వికెట్ తీసుకుని విజయంలో తమవంతు పాత్ర పోషించారు.
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్... నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా ఇన్నింగ్స్ తొలి బంతికే గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. 
 
సూర్యకుమార్ యాదవ్ (50) అర్థ సెంచరీతో అలరించగా, ధవన్ 46, సంజు శాంసన్ 27, ఇషాన్ కిషన్ 20 పరుగులు చేశారు. వన్డే సిరీస్‌లో విఫలమైన హార్దిక్ పాండ్యా (10) మరోమారు తడబడ్డాడు. శ్రీలంక బౌలర్లలో చమీర, హసరంగ చెరో రెండు వికెట్లు తీసుకోగా, కరుణరత్నె ఒక వికెట్ పడగొట్టాడు. 
 
ఆ తర్వాత 165 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకిదిగిన శ్రీలంక జట్టు 126 పరుగులకే ఆలౌట్ అయింది. లంక ఆటగాళ్ళలో చరిత్ అసలంక చేసిన 44 పరుగులే అత్యధికం. అవిష్క ఫెర్నాండో 26, దాసున్ శనక 16, మినోద్ భానుక 10 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేదు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 రేపు జరుగుతుంది.