టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ : ఇంగ్లండ్తో భారత్ అమీతుమీ.. కానీ, వరుణుడి చేతిలో టీమిండియా భవితవ్యం...
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈ నెల 5వ తేదీన భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్కు వర్ష ముప్పు పొంచివుంది. ఒక వేళ భారీ వర్షం కురిసి మ్యాచ్ రద్దు అయితే మాత్రం భారత్ తట్టాబుట్టా సర్దుకుని టోర్నీ నుంచి నిష్క్రమించాల్సివుంది. దీంతో భారత్ భవితవ్యం వరుణ దేవుడి చేతిలో ఉంది.
ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్ - ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల గురువారం సాధ్యం కాకపోతే, శుక్రవారం రిజర్వ్ డేను కేటాయించారు. మ్యాచ్కు ఆలస్యమైనా, కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నిస్తారు. ఇందుకోసం మ్యాచ్ రోజున అదనంగా 90 నిమిషాలు, రిజర్వ్ డే రోజున 120 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది. ఈ ప్రయత్నాలన్నీ విఫలమై, రిజర్వ్ డే రోజున కూడా ఆట సాధ్యపడక మ్యాచ్ పూర్తిగా రద్దయితే, సూపర్ 8 దశలో గ్రూపుల పాయింట్ల పట్టిక ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు.
ఈ నిబంధన టీమిండియాకు ప్రతికూలంగా మారనుంది. సూపర్ 8లో ఇంగ్లండ్ తమ గ్రూపులో ఆడిన మూడు మ్యాచ్లలో గెలిచి టాపర్గా నిలిచింది. మరోవైపు భారత జట్టు రెండు విజయాలతో తమ గ్రూపులో రెండో స్థానంలో సెమీస్కు అర్హత సాధించింది. దీంతో మ్యాచ్ పూర్తిగా రద్దయితే, గ్రూపులో మెరుగైన స్థానంలో ఉన్న ఇంగ్లండ్ జట్టు ఫైనలు చేరుకుంటుంది. ఒకవేళ రెండు సెమీఫైనల్స్ కూడా రద్దయితే, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఫైనల్లో తలపడతాయి.
గత రెండు టీ20 ప్రపంచకప్లలో భారత్ - ఇంగ్లండ్ సెమీస్ పోరు ఆసక్తికరంగా మారింది. 2022లో జరిగిన సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన భారత్ ఇంటిముఖం పట్టగా, ఆ టోర్నీలో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. 2024లో మాత్రం రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు సెమీస్లో ఇంగ్లండ్పై ప్రతీకారం తీర్చుకుని, ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి కప్ గెలుచుకుంది. ఈ రెండు సందర్భాల్లోనూ ఈ సెమీస్ గెలిచిన జట్టే ప్రపంచ ఛాంపియన్గా నిలవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన జరగబోయే మ్యాచ్పై ఉత్కంఠ మరింత పెరిగింది.