టెస్టు మ్యాచ్ను ఐపీఎల్ బాదుడు మ్యాచ్గా మార్చిన రహానే
చాలా రోజుల తర్వాత.. మందకొడిగా సాగే టెస్టు మ్యాచ్ను ఒక ఇండియన్ బ్యాట్స్మన్ ఒక్కసారిగా ఐపీఎల్ బాదుడు మ్యాచ్గా మార్చేశాడు. అదీ అత్యుత్తమ బౌలింగుకు మారుపేరైన ఆస్ట్రేలియా బౌలింగును అవలీలగా ఎదుర్కొని సిక్సర్లు, ఫోర్ల వరద సృష్టించి భారత్కు సీరీస్ విజయం
చాలా రోజుల తర్వాత.. మందకొడిగా సాగే టెస్టు మ్యాచ్ను ఒక ఇండియన్ బ్యాట్స్మన్ ఒక్కసారిగా ఐపీఎల్ బాదుడు మ్యాచ్గా మార్చేశాడు. అదీ అత్యుత్తమ బౌలింగుకు మారుపేరైన ఆస్ట్రేలియా బౌలింగును అవలీలగా ఎదుర్కొని సిక్సర్లు, ఫోర్ల వరద సృష్టించి భారత్కు సీరీస్ విజయం కట్టబెట్టాడు. నిలకడకు మారుపేరుగా నిలిచిన మరొక ఆటగాడు నిదానంగా ఆడుతుంటే నేనిక ఆటను డామినేట్ చేస్తా అని చెప్పి మరీ సిక్సర్ల వరదను పారించాడు. ఆ బ్యాట్స్మన్ ఎవరో కాదు.. తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహానే.
ధర్మశాలలో జరిగిన చివరి టెస్టు నాలుగో రోజు నిలకడగా ఆడిన కేఎల్ రాహుల్ అజేయంగా 51 పరుగులు చేసి.. టీమిండియాను విజయతీరాన్ని చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ కంటే.. తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహానే మెరుపులే నాలుగోరోజు హైలెట్గా నిలిచాయి. దూకుడుగా చెలరేగి ఆడిన రహానే 27 బంతుల్లో 38 పరుగులు చేసి అందరినీ విస్మయంలో ముంచెత్తాడు.
సాంకేతికంగా మంచి బ్యాట్స్మన్గా పేరొందిన రహానే ఎన్నడూ టెస్టుల్లో చెలరేగి ఆడలేదు. అలాంటిది సీరీస్ని నిర్ణయించే మ్యాచ్లో అలా ఎందుకు చెలరేగిపోయి, నాలుగు ఫోర్లు, రెండు భారీ సిక్సర్లతో ఎందుకు రూటు మార్చాడో ఎవరికీ అర్థం కాలేదు. పైగా అదేమీ తక్కువ ఓవర్లలో ఎక్కువ పరుగులు చేయాల్సిన సంక్లిష్టం పరిస్థితీ కాదు. ఈ రహస్యాన్ని కేఎల్ రాహుల్ బయటపెట్టాడు.
బ్యాటింగ్కు వచ్చీరాగానే రాహుల్ వద్దకు వచ్చిన రహానే ఇక నేను డామినెట్ చే్స్తా అని చెప్పి మరీ చెలరేగిపోయాడు. కేవలం అయిదు బంతుల వ్యవధిలో ఓపెనర్ మురళీ విజయ్, చటేశ్వర్ పుజారా వికెట్లు కూలిపోయిన తరుణంలో అడుగుపెట్టిన రహానే విజయంమీద కొండంత ఆశతోనే వరుస బాదుడు ప్రారంభించాడు.
రహానే అలా చెలరేగి ఆడటం టీమిండియాలో, భారత ప్రేక్షకుల్లో కొత్త జోష్ నింపిందనడంలో ఆశ్చర్యం ఏముంది?