1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 జులై 2022 (07:18 IST)

పక్షవాతం బారినపడిన తండ్రిని కొట్టి చంపేసిన తనయుడు

murder
హైదారబాద్ నగరంలో దారుణం జరిగింది. పక్షవాతం బారినపడిన కన్నతండ్రికి సపర్యలు చేయలేని కుమారుడు తన తండ్రిని కొట్టి చంపేశాడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
వెస్ట్ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన సత్యనారాయణ(70) కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చారు. చిన్నాచితకా పనులు చేసుకుంటూ కుత్బుల్లాపూర్‌లో నివాసముంటున్నారు. ఆయనకు భార్య, ఓ కొడుకు, ఇద్దరు కుమార్తెలు.. కష్టపడి ఉన్నంతలో అందరికీ పెళ్లిళ్లు చేశారు.
 
ఈ క్రమంలో ఆయన అనారోగ్యంతో పక్షవాతం బారినపడి కొంతకాలంగా మంచానికే పరిమితమయ్యారు. పెయింటర్‌గా పనిచేసే కొడుకు సురేశ్‌బాబు(38)కు గతంలోనే వివాహమైంది. విభేదాల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తండ్రికి పక్షవాతం కారణంగా అన్ని పనులు చేసుకోలేక పోతుండటంతో భార్య, కొడుకు ఆయనకు సాయం చేస్తుంటారు. 
 
సపర్యలు చేసే విషయంలో సోమవారం తండ్రి, కొడుకుల మధ్య గొడవ జరిగింది. సురేశ్‌ మద్యం మత్తులో ఉండడంతో తల్లి భయపడి సమీపంలోని కుమార్తె ఇంటికి వెళ్లింది. ఇదేసమయంలో సురేశ్‌.. కత్తితో తండ్రి మెడపై పొడిచేందుకు విఫలయత్నం చేశాడు. ఆపై బెల్టు, కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో ఆ దెబ్బలు తాళలేక సత్యనారాయణ ప్రాణాలొదిలారు. 
 
ఈ దారుణాన్ని సురేశ్‌ సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా.. పక్కింటి వ్యక్తి అనుమానించి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా గాయాలు కనిపించాయి. తమదైన శైలిలో ప్రశ్నించగా తానే కొట్టి చంపినట్లు సురేశ్‌ అంగీకరించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.