శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (10:01 IST)

బాణాసంచా కాల్చొద్దన్న యువకుడు.. కత్తితో పొడిచి చంపిన మైనర్లు...

knife
ముంబై నగరంలో దీపావళి పండుగ రోజున ఓ దారుణం జరిగింది. టపాసులు పేల్చొద్దని చెప్పినందుకు ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆ యువకుడిని కొందరు మైనర్లు కలిసి కత్తితో పొడిచి చంపేశారు. ఈ ఘటన ముంబైలోని శివాజీ నగర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబై శివాజీ నగర్‌కు చెందిన 12 యేళ్ల బాలుడు గ్లాసు బాటిల్‌లో టపాసులు ఉంచి పేలుస్తున్నాడు. దీన్ని గమనించిన పొరుగింటి యువకుడు సునీల్ శంకర్ నాయుడు (21) అలా కాల్చొద్దని వారించాడు. పైగా, అది చాలా ప్రమాదమని, గ్లాసు పేలి దాని ముక్కలు అందరికీ గుచ్చుకుంటాయని, అందువల్ల అలా కాల్చొద్దని వారించాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. 
 
ఈ గొడవను చూసిన బాలుడు అన్న (15), అతడి స్నేహితుడు (14) అక్కడికొచ్చాడు. ముగ్గురూ కలిసి శంకర్‌తో గొడవపడ్డారు. ఆ తర్వాత ఆగ్రహంతో వారంతా కలిసి శంకర్‌పై దాడిచేసి కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శంకర్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మైనర్ బాలుడు అన్న, అతడి స్నేహితుడుని అరెస్టు చేశారు. ఈ ఘటనకు కారణమైన మైనర్ బాలుడు మాత్రం పోలీసులకు చిక్కకుండా పారిపోయాడు. అతని కోసం గాలిస్తున్నారు.