గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 ఫిబ్రవరి 2025 (19:16 IST)

అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను సుపారీ ఇచ్చి హత్య చేయించిన ప్రియుడి ఫ్యామిలీ!!

murder
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో మమత అనే మహిళ గత నెలలో దారుణ హత్యకు గురైంది. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. ఓ హంతకుల ముఠాకు సుపారీ ఇచ్చిమరీ ఈ హత్య చేయించినట్టు వెల్లడించారు. తమ బిడ్డతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు గాను ప్రియుడి కుటుంబ సభ్యులు సుపారీ ఇచ్చిమరీ ఈ హత్య చేయించారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాసిపేటకు చెందిన మమత.. జనవరి 27న తన కుమారుడితో కలిసి బెల్లంపల్లి నుంచి కారులో బయలుదేరింది. ఆ తర్వాత కరీంగనర్‌ జిల్లా కొండనపల్లి శివారులో శవమై కనిపించింది. తల్లితో పాటు ఉన్న నాలుగేళ్ల బాలుడు ధ్రువ కనిపించకుండా పోయాడు. 
 
స్థానికంగా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో నిందితులు పరారైన కారు నంబర్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరికి చెన్నైలోని ఒక లాడ్జిలో బాలుడు క్షేమంగా ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లి సంరక్షణలోకి తీసుకున్నారు. బాలుడిని అతని నానమ్మకు అప్పగించారు.
 
నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ప్రాథమిక దర్యాప్తులో లభించిన ఆధారాల ప్రకారం వివాహేతర సంబంధమే హత్యకు కారణమని నిర్ధరించారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. మమత.. భర్తతో విడిపోయి సింగరేణి ఉద్యోగి భాస్కర్‌తో కలిసి ఉంటుందని గుర్తించారు. 
 
మమతకు భారీగా డబ్బు ఇస్తున్నాడని భాస్కర్‌ కుటుంబం తీవ్ర ఆగ్రహంతో ఉండేది. ఈ క్రమంలోనే భాస్కర్‌ కుటుంబ సభ్యులు రూ.5 లక్షలు సుపారీ ఇచ్చి మమతను హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. భాస్కర్‌ సోదరి, ఆమె స్నేహితుడు రఘు, సుపారీ కిల్లర్‌ కల్యాణ్‌, భాస్కర్‌ తండ్రి, అక్క సమీప బంధువును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.