కుమార్తె అక్రమ సంబంధం పెట్టుకుందనీ బిడ్డనూ తల్లిని చంపేసిన కిరాతకుడు...
పెళ్లికాని కన్నబిడ్డ వివాహితుడితో చనువుగా ఉంటూ అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన ఓ కన్నతండ్రి.. కన్నబిడ్డతో పాటు కన్నతల్లిని కూడా చంపేశాడు. ఆ తర్వాత తన తమ్ముడు భార్యపై హత్యాయత్నానికి పాల్పడి, పారిపోయాడు. ఈ దారుణం ఏపీలోని కడప జిల్లా సిద్ధవటం పరిధిలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కడప జిల్లాలోని చలమారెడ్డిపల్లె దండోరా కాలనీలో నివసిస్తున్న చెవిటివాండ్ల బాబు, సుజాత అనే దంపతులకు హారిక(21) అనే కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాబు పెయింటింగ్ మేస్త్రీగాను, సుజాత రిమ్స్లో స్వీపర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో హారిక రాజంపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతూ మధ్యలో మానేసి ఇంటిపట్టునే ఉంటోంది.
అదేసమయంలో అదే కాలనీకి చెందిన వివాహితుడితో చనువుగా ఉంటూ అక్రమ సంబంధం కొనసాగిస్తోందని బాబు అనుమానించాడు. పైగా, కుమార్తె ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండేందుకు వీలుగా కన్నతల్లి ఓబులమ్మ (65)ను కాపలాగా ఉంచాడు. ఈ క్రమంలో జూలై 31వ తేదీన వృద్ధాప్య పెన్షన్ తీసుకునేందుకు ఓబులమ్మ తన స్వగ్రామమైన మైదుకూరు మండలం వనిపెంట ఎస్సీ కాలనీకి వెళ్లి, తిరిగి రాకుండా అక్కడే ఉండిపోయింది. దీంతో కుమార్తెపై మరింతగా అనుమానం పెరిగి పెనుభూతమైంది.
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను తీవ్రంగా గాయపరిచి హతమార్చాడు. అనంతరం తన తల్లి ఉండే వనిపెంటకు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. అక్కడి నుంచి సిద్దవటం మండలం మాచుపల్లె శివారుకు తీసుకెళ్లాడు. తన కుమార్తెకు కాపలాగా ఉండకుండా వనిపెంటకు ఎందుకు వెళ్లావంటూ గొంతు నుమిలి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పొలాల్లో పడేశాడు.
అక్కడ నుంచి సిద్ధటం మండలం పొన్నవోలు కొత్తపల్లెలో ఉన్న తన మరదలు అయ్యవారమ్మ ఇంటి వద్దకు అర్థరాత్రి వెళ్లాడు. తన సోదరుడితో కాపురం చేయకుండా ఎందుకు ఒంటరిగా ఉంటున్నావంటూ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. తల్లి, కుమార్తె హత్యకు గురైన సమాచారం మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చాయి. ఈ జంట హత్యలపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. పరారీలో ఉన్న బాబు కోసం గాలిస్తున్నారు.
