1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 జులై 2022 (13:09 IST)

సంగారెడ్డిలో పరువు హత్య - ప్రేమ పెళ్లి చేసుకున్న టెక్కీని చంపేశారు

murder
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జిన్నారంలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నారాయణరెడ్డి (25)ని హతమార్చారు. హత్య అనంతరం జిన్నారం అటవీ ప్రాంతంలో యువకుడి మృతదేహాన్ని తగులబెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్‌ 1లో నారాయణ రెడ్డి తన స్నేహితుడితో కలిసి ఉంటున్నారు. ఈయన యేడాది క్రితం ఓ యువతిని నారాయణరెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లిపోయారు. 
 
ఆ తర్వాత కూడా యువతి, నారాయణ రెడ్డి ఫోన్‌లో మాట్లాడుకుంటున్నట్లు గుర్తించిన తల్లిదండ్రులు, బంధువులు.. అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా నారాయణరెడ్డి కనిపించకపోవడంతో జూన్‌ 30న కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. 
 
ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు.. మృతుడి కాల్‌డేటా ఆధారంగా శ్రీనివాస్‌ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. శ్రీనివాస్‌ రెడ్డితో నారాయణ రెడ్డికి ముందే పరిచయం ఉండటంతో జూన్‌ 29న వాళ్లిద్దరితో పాటు మరికొంతమంది ఖాజాగూడ వద్ద ఓ వైన్‌షాపులో మద్యం కొనుగోలు చేసి ఓ చోట సేవించారు. అనంతరం నారాయణ రెడ్డిని గొంతు నులిమి హతమార్చి జిన్నారం అటవీ ప్రాంతంలో పెట్రోల్‌ పోసి తగులబెట్టారు.
 
శ్రీనివాస్‌ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయాలు బయటకు వచ్చాయి. నిందితుడు చెప్పిన వివరాల మేరకు ఘటనాస్థలానికి పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. యువతి కుటుంబసభ్యులే నారాయణ రెడ్డిని హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.