1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: శనివారం, 22 జనవరి 2022 (18:15 IST)

దళిత మహిళను కానిస్టేబుళ్ళు బూటు కాళ్ళతో తన్నుతూ...

సర్.. నేను దొంగతనం చేయలేదు. నేను మీ ఇంట్లో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నాపై నమ్మకం ఉంచండి.. నేను ఎప్పుడైనా దొంగతనం చేశానా.. ఎక్కడా చేయలేదు. చేయను కూడా. కష్టపడి వచ్చిన డబ్బులతో అన్నం తింటున్నాను. నన్ను వదిలేయండి అంటూ ప్రాధేయపడింది ఆ మహిళ.

 
అయితే ఒప్పుకోలేదు. కానిస్టేబుళ్ళు అతి దారుణంగా ఆమెను బూటుకాళ్ళతో తన్నారు. నువ్వే దొంగతనం చేశావు. 2 లక్షల రూపాయల డబ్బును ఎత్తుకెళ్ళావు. ఆ డబ్బును తిరిగి ఇచ్చేయి అంటూ చితకబాదారు. తీవ్ర గాయాలపాలైన ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆమె వేలిముద్రలు సేకరించి చివరకు ఇంట్లో దొంగతనం చేసింది ఆ మహిళ కాదని నిర్థారించుకున్నారు.

 
ఇదంతా ఎక్కడో కాదు. చిత్తూరు జిల్లాలోనే జరిగింది. సాక్షాత్తు పోలీసు అధికారే ఇలా చేశారు. తన ఇంట్లో నిన్న 2 లక్షల రూపాయలు కనిపించకుండా పోయాయి. దీంతో అనుమానంతో తన ఇంట్లో పనిమనిషి ఉమామహేశ్వరిని విచారించాడు.

 
విచారించడమంటే అలా ఇలా కాదు. థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు. కానిస్టేబుళ్ళతో చితకబాదారు. వేలిముద్ర నిపుణులు మొత్తాన్ని పరిశీలించి దొంగ ఆమె కాదని తేల్చారు. తీవ్రగాయాలపాలైన ఆమె చికిత్స తీసుకుని నేరుగా ఈరోజు మధ్యాహ్నం చిత్తూరు ఎస్పీని ఆశ్రయించింది.

 
తనను కొట్టిన అధికారితో పాటు కొంతమంది కానిస్టేబుళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరింది మహిళ. మహిళ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.