1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 డిశెంబరు 2021 (14:02 IST)

#HistoryInToday : ప్రకృతి జల ప్రళయం సునామీకి 17 యేళ్లు

గత 2004లో భారీ ప్రకృతి ప్రళయం సునామీ సంభవించింది. ఈ జల ప్రళయానికి అనేక వేల మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ సహా ఏకంగా 13 దేశాల్లో తీవ్ర విషాదం నెలకొల్పింది. ఈ ప్రకృతి జల ప్రకోపానికి డిసెంబరు 26వ తేదీకి 17 సంవత్సరాలు.
 
ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో హిందూ మహాసముద్రంలో 9.15 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత సునామీ మొదలైంది. ఈ  సునామీ కారణంగా హిందూ మహాసముద్రంలోని అలలు 100 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. 
 
ఈ సునామీ తరంగాల ప్రభావం భారత్‌తో పాటు ఇండోనేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, మాల్దీవులు, మడగాస్కర్, సీషెల్స్, సోమాలియా, టాంజానియా, కెన్యా, మలేషియా తదితర దేశాల్లో విధ్వంసం సృష్టించాయి. 
 
ఈ సునామీ జల ప్రళయానికి 13 దేశాల్లో ఏకంగా 2.30 లక్షల మందిని సముద్రపు అలలు మింగేశాయి. ఒక్క ఇండోనేషియాలోనే దాదాపు 1.28 లక్షల మంది జలసమాధి అయ్యారు. భారత్‌లో 12 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోగా, 3 వేల మంది వరకు గల్లంతయ్యారు. సముద్రుడి అలల ప్రకోపానికి బంగళాలు, కార్లు, పడవలు ఇలా ఒక్కటేంటి తన దారికి అడ్డొచ్చిన సర్వనాశనమయ్యాయి. 
 
ఇండోనేషియా, శ్రీలంక దేశాల్లో దాదాపు 18 లక్షల మంది తమ ఆవాసాలను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. మరో 50 వేల మంది గల్లంతయ్యారు. 2004 డిసెంబరు 26వ తేదీని ప్రపంచంలో అత్యంత విచారకరమైన రోజుగా చరిత్రలో చెప్పుకుంటారు.