1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
  4. Indian Teen's Powerful Glasgow COP26 Speech. PM Modi, Biden Were Present

మీ శుష్క వాగ్దానాలు వినీవినీ విసిగొచ్చేస్తోంది.. మిమ్మల్ని చూస్తే కోపం వస్తోంది..

Indian Teen
ఓ భారత అమ్మాయి పలు దేశాధినేతలను కడిగిపారేసింది. గ్లాస్కో వేదికగా సీఓపీ26 పేరుతో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ సదస్సును ఆమె వేదికగా చేసుకుంది. ఆ తర్వాత ప్రపంచాధినేతలకు సూటిగా సుత్తిలేకుండా పలు ప్రశ్నలు సంధించారు. వారి తీరును అంతర్జాతీయ వేదికపై నుంచి ఎండగడ్డారు. ఇకనైనా శుష్క వాగ్ధానాలు మానుకోవాలని సూచించారు. 
 
వీరిలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఉన్నారు. 'నేను కేవలం భారత్ బిడ్డనే కాదు.. ఈ ధరిత్రీ పుత్రికను. అందుకు నేను గర్విస్తున్నాను' అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టిన ఈ భారత చిన్నారి.. 'మీ శుష్క వాగ్దానాలు వినీవినీ విసిగొచ్చేస్తోంది.. మిమ్మల్ని చూస్తే కోపం వస్తోంది.. కానీ, నాకు అంత సమయం లేదు. చేతల్లోనే చేయాలి. ఇక మీరు చెప్పింది చాలు.. చేతల్లో చూపించండి' అంటూ ప్రపంచాధినేతలకు భయం.. బెరుకు లేకుండా సూటిగా చెప్పేసింది. 
 
ఆ చిన్నారి పేరు వినీశా ఉమాశంకర్. వయసు 14 యేళ్లు. తమిళనాడులోని తిరువణ్ణమలై జిల్లా ఆమె ఊరు. జర్మనీలోని గ్లాస్గోలో వేదికగా కాప్ 26 సదస్సులో ఆమె పాల్గొంది. క్లీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ అనే అంశంపై ఉద్విగ్న భరితమైన ప్రసంగం చేసింది. బ్రిటన్ యువరాజు విలియమ్స్ ఆహ్వానం మేరకు ఆమె అక్కడి వరకు వెళ్లి ప్రపంచ వేదికపై తన గళాన్ని వినిపించింది.
 
'ప్రపంచ నేతలు చేస్తున్న ఉత్తుత్తి హామీలు విని మా తరం విసుగెత్తిపోతోంది. ఆ ఉత్తి హామీలను ఆపేయండి. పర్యావరణాన్ని రక్షించి భూమిని కాపాడండి. పాత చర్చలపై అనవసర ఆలోచనలను మానండి. నవ భవిష్యత్ కోసం నవ దృక్పథం ఎంతో అవసరం. కాబట్టి మీరు మీ సమయాన్ని, డబ్బును, ప్రయత్నాలను మా లాంటి ‘ఎర్త్ షాట్ ప్రైజ్’ విన్నర్లు, ఫైనలిస్టుల ఆవిష్కరణలపై ఇన్వెస్ట్ చేయండి. శిలాజ ఇంధనాలు, పొగ, కాలుష్యం వంటి వాటి వల్ల నిర్మితమవుతున్న ఆర్థిక వ్యవస్థపై కాదు' అంటూ చురకలంటించింది.
 
తమతో పాటు ప్రపంచ నేతలు కలిసి నడవాలని, స్వచ్ఛ ఇంధనాలను రూపొందించాల్సిన అవసరం ఉందని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చింది. పాతకాలపు ఆలోచనలు, అలవాట్లను వదులుకోవాలని సూచించింది. తాము పిలిచినప్పుడు మీరొచ్చినా.. రాకున్నా.. తామే ముందుండి ఆ బాధ్యతను తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రపంచ నేతలు ఆలస్యం చేసినా తాము రంగంలోకి దిగుతామని పేర్కొంది. తమ భవిష్యత్తును తామే కాపాడుకుంటామని తేల్చి చెప్పింది.

 
About Writer
ఠాగూర్