గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జెఎస్కె
Last Modified: శుక్రవారం, 16 జులై 2021 (15:18 IST)

స్పీడందుకుంటున్న ఓటుకు నోటు కేసు, చంద్ర‌బాబుకు చుట్టుకుంటుందా?

ఓటుకు నోటు సాక్షుల విచారణకు షెడ్యూల్ ఖ‌రాయింది. అప్ప‌ట్లో... మా వాళ్లు బ్రీఫ్డ్ మి అంటూ... ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు వాయిస్ తో ఓటుకు నోటు కేసు సంచ‌ల‌నం అయింది. ఇపుడు అదే చంద్ర‌బాబు మాజీగా మార‌గా, కేసులో ప్ర‌త్య‌క్షంగా పాల్గొన్న రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడు అయ్యారు. దీనితో ఈ కేసుకు ప్రాముఖ్యం పెరిగింది. 
 
ఓటుకు నోటు కేసులో సాక్షుల విచారణ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇప్పటికే పది మంది కీలక సాక్షుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియ పూర్తి కాగా.. ఈనెల 26 నుంచి ఆగస్టు 13 వరకు 33 మంది సాక్షుల విచారణ చేపట్టేలా అవినీతి నిరోధక శాఖ(అనిశా) ప్రత్యేక న్యాయస్థానం షెడ్యూల్‌ రూపొందించింది.

కేసులో సుమారు 50 మందికి పైగా సాక్షులు ఉన్నార‌ని, వేగంగా విచారణ ప్రక్రియ పూర్తి చేయాలని అనిశా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్ రావు కోరారు. వారంలో రెండు రోజులు మాత్రమే విచారణ జరపాలని, రోజూ విచారణ చేపట్టడం వల్ల న్యాయవాదులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు.

పాక్షికంగానే ప్రత్యక్ష విచారణలు చేపట్టాలని హైకోర్టు పేర్కొన్నందున వారానికి ఒకసారే సాక్షుల విచారణ చేపట్టాలని సెబాస్టియన్ తరఫు న్యాయవాది కోరారు. కొవిడ్ బారిన పడిన ఉదయ్ సింహా కోలుకుంటున్నారని... రోజూ సాక్షుల విచారణ వల్ల ఇబ్బంది పడుతున్నారని ఆయన తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
 
ఈ కేసులో ప్రజా ప్రతినిధులపై అభియోగాలు ఉన్నందున.. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు వేగంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అనిశా కోర్టు అభిప్రాయపడింది. పాక్షిక ప్రత్యక్ష విచారణల్లో ఐదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసినట్లు అనిశా కోర్టు గుర్తు చేసింది. సాక్షుల విచారణ షెడ్యూల్‌ రూపొందించి న్యాయవాదులకు ఇవ్వాలని గత నెలలో ఉన్నత న్యాయస్థానం ఆదేశించిందని తెలిపింది.

వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఈనెల 26 నుంచి ఆగస్టు 13 వరకు 33 మంది సాక్షులను విచారించనున్నట్లు పేర్కొంది. ఆగస్టు 14 నుంచి 30 వరకు సెలవులో వెళ్లనున్నందున మిగతా సాక్షుల విచారణ సెప్టెంబరు 1 నుంచి చేపట్టనున్నట్లు అనిశా కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు.