1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: బుధవారం, 14 జులై 2021 (17:44 IST)

కుప్పం ప్ర‌జ‌ల‌కు ఆక్సీజ‌న్ అందించిన ఎమ్మెల్యే చంద్ర‌బాబు

చెప్పాడంటే... చేస్తాడంతే... ఇది న‌వ యువ ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్లోగ‌న్. కానీ, ఇపుడు దాన్ని మాజీ సీఎం చంద్రాబాబు నాయుడు అందిపుచ్చుకున్నారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో క‌రోనా బాధితుల‌కు ఆక్సీజ‌న్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాన‌ని గతంలో హామీ ఇచ్చారు. అంతే, ఇపుడు ఆ ఆక్సీజ‌న్ ప్లాంట్ ని ఎన్టీయార్ ట్ర‌స్ట్ ద్వారా ఏర్పాటు చేసి చూపించారంతే.
 
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు కుప్పంలోని పార్టీ నేతలతో గ‌తంలో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలోని యుద్ధప్రాతిపదికన వైద్య సదుపాయాలు కల్పించాలని, సిబ్బంది కొరతను తీర్చాలని స్థానిక నాయకులను ఆదేశించారు. అయితే అందుకు అవసరమైన మొత్తం ఖర్చును తానే భరిస్తానని వారికి భరోసా కల్పించారు.

ప్రధానంగా కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో 35 లక్షల రూపాయ‌లతో సొంత నిధులను ఖర్చు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించనున్నట్లు తెలిపారు. దీంతో పాటు వైద్య సిబ్బంది కొరతను కూడా తీరుస్తా అని హామీ ఇచ్చారు. వెంటనే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ద్వారా సిబ్బంది నియామకాలు చేపట్టాలని, దానికి కావాల్సిన నిధులు కూడా తానే స్వయంగా సమకూరుస్తానని హామీ ఇచ్చారు.

ఆసుపత్రి మొదటి అంతస్తులో ఆక్సిజన్ సరఫరాను గ్రౌండ్ ఫ్లోర్‌కి అందేలా మరమ్మతులు వెంటనే చేయించాలని సూచించారు. ఇలా చెప్ప‌డ‌మే కాదు... చేసి చూపించారు. కుప్పం కు ఎన్టీయార్ ట్ర‌స్ట్ ద్వారా ఆక్సీజ‌న్ ప్లాంటును ఇలా ఏర్పాటు చేశారు. థ‌ర్డ్ వేవ్ వ‌స్తుంద‌నే ఆందోళ‌న‌లో కుప్పం ప్ర‌జ‌లుండ‌గా, వారిని ఆదుకునేందుకు చంద్ర‌బాబు ఆక్సీజ‌న్ ప్లాంట్ ఏర్పాటు చేయ‌డం స్థానికుల్లో ఆనందానికి కార‌ణ‌మైంది. కరోనా కష్ట సమయంలో చంద్రబాబు  మానవత్వాన్ని చూపార‌ని అంతా ప్రశంసిస్తున్నారు.