మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By శ్రీ
Last Modified: గురువారం, 7 మే 2020 (22:47 IST)

వైజాగ్ గ్యాస్ లీక్, అసలు ఏం జరిగింది?

చిన్నపాటి నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను హరిస్తోంది. గతంలో జరిగిన ఘటనలతో అప్రమత్తం అవ్వాల్సిన పరిశ్రమలు అధే ధోరణి అనుసరించి ప్రజలతో చెలగాటమాడుతోంది. ప్రమాదం జరిగే సమయంలో సైరన్‌తో ప్రజలను అలెర్ట్ చేసే వ్యవస్థ పటిష్టంగా లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లీక్ అయ్యే క్షణంలో ప్రజలను అలెర్ట్ చేస్తే ఇలాంటి పరిణామం జరిగేది కాదని స్ధానికులు భావిస్తున్నారు. 
 
చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ అత్యవసర వైద్య సేవలను కూడా అందించే ఏర్పాట్లు చెయ్యకపోవడం ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయింది. విశాఖ ఎల్జి పాలిమర్స్... ఈ సంస్థలో రసాయాలతో కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఈ సంస్థను 1997లో విశాఖ జిల్లా గోపాలపట్నం సమీపంలో ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో ఏర్సాటు చేశారు. 213 ఎకరాల విస్తీర్ణంలో 168 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంతో ఈ సంస్థ ప్రారంభమైంది. 
 
ఈ కంపెనీ ప్రతిరోజు 417 టన్నుల ధర్మాకోల్ షీట్‌కు సంబంధించి తయారీ జరుగుతుంది. దీన్ని స్టెరైన్ అనే గ్యాస్ ద్వారా తయారు చేస్తారు. ప్రస్తుతం ఇదే గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం తలెత్తింది. ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి లీకైన గ్యాస్‌ను పీవీసీ గ్యాస్‌ లేక స్టెరిన్‌ గ్యాస్‌ అంటారు. సింథటిక్‌ రబ్బర్‌, ప్లాస్టిక్‌, డిస్పోసబుల్‌ కప్పులు, కంటైనర్లు, ఇన్సులేషన్‌.. ఇలా పలు ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. స్టెరిన్‌ గ్యాస్‌కు రంగు వుండదు. తీయటి వాసన వుంటుంది. రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకు దాని ప్రభావం వుంటుంది.
 
లీకైన క్షణాల్లోనే మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వెంటనే బాధితుడికి చికిత్స అందకపోతే ప్రాణాలను కూడా పోయే ప్రమాదం ఉంది. ఈ గ్యాస్ పీలిస్తే ... వెంటనే కంటిచూపుపై ప్రభావం చూపిస్తుంది. తలనొప్పి, కడుపులో వికారానికి దారి తీస్తుంది. శ్వాస పీల్చుకోవడం కష్టమై.. బాధితుడు ఉక్కిరిబిక్కిరై పోతాడు. ఊపిరి అందక విలవిలలాడిపోతాడు. స్టిరీన్‌ గ్యాస్‌ పశు పక్ష్యాదులపై సైతం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. గ్యాస్‌ లీకైన ప్రాంతంలో చెట్లు కూడా నల్లగా మారిపోతాయని నిపుణులు చెపుతున్నారు.
 
ఈ క్రమంలో ప్రజలను అప్రమత్తం చేసే వ్యవస్థ లేకపోవడంతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. ఈ కంపెనీ డైరెక్టర్‌గా పిపి రామచంద్ర మోహన్ వ్యవహరిస్తున్నారు.
 ఈ గ్యాస్ లీకేజీ తెల్లవారు జామున గంటల సమయంలో పరిశ్రమ నుంచి వెలువడిన రసాయన వాయువు దాదాపు 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. కాగా లీకైన రసాయన గాలి పీల్చడంతో అక్కడి స్థానిక ప్రజలు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో పాటు కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ నాయుడు తోట పరిసరాల్లో ఇల్లు ఖాళీ చేసి మేఘాద్రి గడ్డ డ్యామ్ వైపు పరుగులు తీశారు. 
 
కాగా రసాయన గాలి పీల్చడంతో కొంతమంది అస్వస్థతకు గురై అపస్మారకస్థితిలో రహదారిపైనే పడిపోయారు. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు లాక్‌డౌన్‌లో ఉన్న ఈ కంపెనీని తెరిపించే క్రమంలో తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా పరిశ్రమ నుంచి స్టెరైన్ అనే విష వాయువు లీకైనట్లు తెలుస్తుంది.
 విశాఖ గ్యాస్‌ లీక్‌ ప్రమాదానికి ఎల్‌జీ పాలిమర్స్‌ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.
 
లాక్‌డౌన్‌లోనూ పరిశ్రమలో ప్రతిరోజు మెయింటెనెన్స్‌ చేయాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా సమాచారం. అయితే పరిశ్రమ ట్యాంకుల్లో దాదాపు 2 వేల మెట్రిక్‌ టన్నుల స్టైరెన్‌ను నిల్వ చేసింది. అక్కడ 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉంచడంలో ఫ్యాక్టరీ యాజమాన్యం విఫలమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో.. స్టైరెన్‌ లీక్‌ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలకు స్టైరెన్‌ గ్యాస్‌ వేగంగా వ్యాప్తి చెందింది. 
 
తెల్లవారుజామన చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, దాదాపు 200 మంది అస్వస్థతకు లోనయ్యారు.
 విశాఖలో ఈ ఎల్జీ పాలిమర్స్ సంస్ధ ద్వారా చాలా వరకూ విషవాయుల ప్రభావం అదికంగా ఉంటోందని స్ధానికులు గత కొన్నేళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించాల్సిన యాజమాన్యం దిద్దుబాటు చర్యలు తీసుకొవడంలో వైఫల్యం చెందడంతో భారీ విస్పోటనానికి ప్రజలు బలికావాల్సి వస్తోంది.
 
అయితే ఈ సారి వచ్చిన ఈ ప్రమాదం అర్థరాత్రి సమయంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్పి వచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే తక్షణమే స్పందించాల్సిన వ్యవస్ధలు సక్రమంగా స్పందించకపోవడంతో దుర్ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి ప్రమాదవశాత్తు లీకైన విషవాయువు పీల్చి చుట్టుపక్కల ఉండే ప్రజలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో భాదితులను తక్షణమే కేజీహెచ్‌కి తరలించి చికిత్సను అందిస్తున్నారు.