1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
  4. Why NDA Govt May Not Accept UAE's Rs. 700-Crore Offer For Kerala

కేరళకు విదేశీ సాయాలకు నో... అమ్మ పెట్టనూ పెట్టదు... అడుక్కు తిననివ్వదు

వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్ర పునర్నిర్మాణం, బాధితుల పునరావాసం వంటి వాటిలో భారత్‌కు చేయూతనందించేందుకు సిద్ధమని యూఏఈ, ఖతార్, మాల్దీవులు ఇప్పటికే ప్రకటించినప్పటికీ, విదేశాలు ప్రకటించిన సదరు సాయాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం తిరస్కరించబోతోందనే సమాచారం

NDA Govt
వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్ర పునర్నిర్మాణం, బాధితుల పునరావాసం వంటి వాటిలో భారత్‌కు చేయూతనందించేందుకు సిద్ధమని యూఏఈ, ఖతార్, మాల్దీవులు ఇప్పటికే ప్రకటించినప్పటికీ, విదేశాలు ప్రకటించిన సదరు సాయాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం తిరస్కరించబోతోందనే సమాచారం చక్కర్లు కొడుతోంది. వివిధ దేశాలు ప్రకటించిన సాయం పట్ల పూర్తి కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నప్పటికీ, తన సొంత నిధులతోనే కేరళను పునర్నిర్మించాలని భారత్ భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా విదేశాలలో స్థిరపడిన భారతీయులు పంపుతున్న విరాళాలకు మాత్రం ప్రభుత్వం ఎటువంటి అడ్డు చెప్పడం లేదు.
 
దుబాయ్, కేరళ మధ్య అనుబంధానికి మరియు భారత్-యూఏఈ మధ్య సన్నిహిత సంబంధాలకు ప్రతీక అని అందరూ భావించేలా యూఏఈ ప్రధానమంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ కేరళకు రూ. 700 కోట్ల భారీ సాయాన్ని ప్రకటించారు. దీనికిగానూ, ప్రధాని నరేంద్రమోడీ, కేరళ సిఎం పినరయి విజయన్‌లు కూడా యూఏఇ అధినేతకు ట్విట్టర్‌లో కృతజ్ఞతలు కూడా తెలియజేసారు. కాగా, ఖతార్ దాదాపు రూ.35 కోట్లు సాయం చేస్తామని తెలియజేయగా, ఇటీవల భారత్‌తో స్నేహం కలుపుకున్న మాల్దీవులు కూడా 50 వేల డాలర్లు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. కానీ ఈ అన్ని సాయాలకు భారత్ నుండి ఎటువంటి అభ్యర్థన రాకపోవడంతో ఇవేవీ ఆచరణకు నోచుకోవనే అనిపిస్తోంది.
 
కాగా ఎలాంటి విపత్తులనైనా తట్టుకుని నిలబడగల సామర్థ్యం మన దేశానికి ఉన్నదనే విషయాన్ని స్పష్టం చేయడమే లక్ష్యంగా, ఎటువంటి ప్రకృతి విపత్తులు సంభవించినా విదేశాల సాయాన్ని అర్థించరాదని 2004 సునామీ సమయంలో భారత్ ఒక దీర్ఘకాలిక విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే 2013 ఉత్తరాఖండ్ వరదల సమయంలోనూ అప్పటి యూపీఏ ప్రభుత్వం విదేశాల సాయాన్ని సున్నితంగా తిరస్కరించింది. ప్రస్తుతం ఈ విధానాన్ని కఠినంగా అమలు చేయడంలో భాగంగానే, ప్రస్తుతం విదేశాలు ప్రకటించిన సాయాన్ని కూడా కేంద్రం తిరస్కరించనున్నట్టు తెలుస్తోంది. కాగా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చూస్తూంటే, అమ్మ పెట్టనూ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్లుగా తయారుతుందేమోనని కూడా కొందరు విశ్లేషించుకుంటున్నారు. 
About Writer
Vasu
తర్వాతి కథనం
ఒంటిపై నూలు పోగు లేకుండా కారు దిగిన యువతి... జడ్జి పదవి పోయింది...