శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 నవంబరు 2020 (18:00 IST)

దీపావళి రోజున ఎలా పూజ చేయాలి..

దీపావళి పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజున  వస్తుంది. దీపావళి పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి రోజున నరక చతుర్థశిగా జరుపుకుంటారు. ఆ రోజు మంగళ స్నానాలు చేస్తారు. హారతులు తీసుకుంటారు. ఈ పండుగకు కుమార్తెలను, అల్లుళ్ళని ఇంటికి ఆహ్వానిస్తారు. వారికి కానుకలు ఇచ్చి గౌరవిస్తారు. 
 
దీపావళి రోజున ఉదయం ఐదు గంటలకు లేచి, తలస్నానం చేసి పూజామందిరం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరంలో అందమైన ముగ్గులతో తీర్చిదిద్దుకోవాలి. తెలుపు బట్టలు ధరించి... దైవమూర్తుల పటాలకు గంధము, కుంకుమలతో అలంకరించాలి.
 
ఆ తర్వాత ఆకుపచ్చని రంగుతో కూడిన కూర్చున్న శ్రీ లక్ష్మీదేవీ పటాన్నిగానీ, వెండితో తయారైన లక్ష్మీదేవి ప్రతిమను గానీ పూజకు సిద్ధం చేసుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్ర పద్మాలు, తెలుపు కలువ పువ్వులు, గులాబి పువ్వులతో లక్ష్మీదేవి అర్చించాలి.
 
జామకాయలు, రవ్వలడ్డులు, కేసరి బాత్, అరిసెలు వంటి పిండిపదార్థాలను నైవేద్యం పెట్టి శ్రీ లక్ష్మీ అష్టోత్తరము, శ్రీ మహాలక్ష్మీ అష్టకం స్తోత్రాలను పఠించాలి. అంతే కాకుండా శ్రీ సూక్తము, శ్రీ లక్ష్మీ సహస్రనామము, భాగవతము, కనకధారాస్తవము వంటి పారాయణ స్తోత్రాలతో లక్ష్మీదేవిని పూజించాలి. అందులో ముఖ్యంగా భాగవతములోని నరకాసురవధ అధ్యాయమును పారాయణము చేయాలి.
 
దీపావళి రోజున మహాలక్ష్మీ ధ్యానించి విశాఖ కనకమహాలక్ష్మీ దేవి, అష్టలక్ష్మీ దేవాలయం, కొల్హాపూర్ వంటి క్షేత్రాలను దర్శించుకుంటే సకల సంపదలు దరిచేరుతాయని విశ్వాసం. ఇదే రోజున కుంకుమ పూజ గావించిన స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తం చేకూరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
 
దీపావళి పర్వదినాన దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఐతిహ్యం. అంతేకాకుండా నరకాసురుని వధించిన దీపావళి రోజున లక్ష్మీ కుబేర వ్రతము లేదా వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పెద్దలంటున్నారు.