పోలీసులకు, సైన్యానికి జీతాలు ఇవ్వలేక ఇరాన్ చస్తోంది, మరికొన్ని రోజులు చూస్తా: ట్రంప్ ఎద్దేవా
ఇరాన్ దేశంపై కాల్పుల విరమణ సమయాన్ని మరికాస్త పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ ద్వారా తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ... ఇరాన్ నాయకత్వం ప్రస్తుతం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. వాళ్లంతా కూర్చుని ఆలోచన చేసి సమగ్రమైన శాంతి ప్రతిపాదనతో వస్తారని ఆశిస్తున్నాను. కానీ ఇరాన్ పోర్టుల దిగ్బంధనం మాత్రం సాగుతూనే వుంటుంది. ఆ దేశం ఆర్థికంగా కుప్పకూలుతోంది. పోలీసులకు, సైన్యానికి జీతాలు ఇవ్వలేక ఇరాన్ చస్తోంది. అదంతా చూస్తూనే వున్నా. మరికొన్ని రోజులు వేచి చూస్తా. వాళ్లు మారతారని ఆశిస్తున్నా అంటూ పేర్కొన్నారు.
ట్రంప్ స్పందనపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. మమ్మల్ని ఆకలికి అలమటించేట్లు చేసి కాల్పుల విరమణ అంటారా, తమ దేశానికి ఏవీ అందకుండా చేయడం ద్వారా మీరు చేస్తున్నదేమిటి. ఇది యుద్ధం కంటే తీవ్రమైనది. దీనికి సైనిక చర్యతోనే సమాధానిస్తాము.
ట్రంప్ కాల్పుల విరమణ అంతా ఓ బూటకం. కేవలం తమపై మూకుమ్మడి దాడి చేసేందుకే సమయం తీసుకుంటున్నారు. అంతేతప్ప ఈ పొడగింపు అంతా ఓ పెద్ద డ్రామా అంటూ కొట్టిపారేసింది. మరోవైపు ఇస్లామాబాదులో జరగాల్సిన రెండో దఫా శాంతి చర్చలకు బ్రేక్ పడింది. అటు ఇరాన్ చర్చలకు వచ్చేందుకు ఆసక్తి చూపించకపోవడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. మొత్తమ్మీద ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఎలాంటి మలుపు తిరుగుతాయోనన్న ఆందోళనలో ప్రపంచ దేశాలున్నాయి.
