1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
  4. Deep Brain Stimulation is a Key Treatment for Controlling Parkinson's: Medicover Doctors

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

Doctors
సికింద్రాబాద్: భారతదేశంలో వేగంగా పెరుగుతున్న న్యూరోలాజికల్ వ్యాధుల్లో పార్కిన్సన్స్ వ్యాధి (Parkinson-s Disease) ఒకటిగా మారుతోందని మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ న్యూరో సైన్సెస్ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా 60 సంవత్సరాల పైబడిన వారిలో ఈ వ్యాధి అధికంగా కనిపిస్తోందని, ఆలస్యంగా గుర్తించడం వల్ల రోగులు క్రమంగా స్వతంత్ర జీవనాన్ని కోల్పోతున్నారని వైద్యులు హెచ్చరించారు.
 
మెదడులో డోపమైన్ ఉత్పత్తి చేసే కణాలు క్రమంగా దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి వస్తుందని నిపుణులు వివరించారు. చేతులు వణకడం, కాళ్లు గట్టిపడటం, నడకలో అస్థిరత, శరీర కదలికలు మందగించడం, తరచూ పడిపోవడం, మాట్లాడడంలో మరియు రోజువారీ పనుల్లో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. వ్యాధి ముదిరే కొద్దీ రోగులు పూర్తిగా ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.
 
ప్రారంభ దశల్లో మందులతో లక్షణాలను నియంత్రించవచ్చని, అయితే అడ్వాన్స్‌డ్ దశలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (DBS) వంటి ఆధునిక చికిత్సలు రోగులకు గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న ఈ చికిత్సలో మెదడులోని ప్రత్యేక భాగాల్లో ఎలక్ట్రోడ్స్ అమర్చి కదలికలను నియంత్రించే విధంగా పనిచేస్తుందని వివరించారు.
 
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ దూసా మాట్లాడుతూ, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పార్కిన్సన్స్‌కు పూర్తి నివారణ కాకపోయినా, సరైన రోగుల్లో వణుకు, కండరాల గట్టితనం, కదలికల సమస్యలను గణనీయంగా తగ్గిస్తుంది. దీని వల్ల రోగులు మళ్లీ సాధారణ జీవితానికి చేరుకునే అవకాశం ఉంటుంది అని తెలిపారు. ఇటీవల ఖమ్మం జిల్లాకి చెందిన 63 ఏళ్ల శ్రీ రాకేష్‌కు మెడికవర్ హాస్పిటల్స్‌లో విజయవంతంగా డీబీఎస్ శస్త్రచికిత్స నిర్వహించినట్లు వైద్యులు వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన కదలికలు, నడక మరియు శారీరక స్థిరత్వంలో స్పష్టమైన మెరుగుదల కనిపించిందని తెలిపారు.
 
ఈ క్లిష్టమైన చికిత్సను డాక్టర్ శ్రీనివాస్ దూసా, డాక్టర్ రమేష్ శిఖాకొల్లి, డాక్టర్ రోహిత్ రమేష్, డాక్టర్ వికాస్ అగర్వాల్, డాక్టర్ సుధీర్‌లతో కూడిన మల్టీడిసిప్లినరీ న్యూరో సైన్సెస్ బృందం విజయవంతంగా నిర్వహించింది. న్యూరో అనస్థీషియా, ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్, క్రిటికల్ కేర్, నర్సింగ్ బృందాలు కూడా కీలక పాత్ర పోషించాయి. పార్కిన్సన్స్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం, క్రమం తప్పకుండా వైద్య పర్యవేక్షణలో ఉండటం, ఫిజియోథెరపీ, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా రోగులు ఎక్కువకాలం చురుకుగా జీవించవచ్చని మెడికవర్ నిపుణులు సూచించారు.
About Writer
జయ
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?