1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (12:07 IST)

కరోనా కల్లోలం... బ్రెజిల్ ఆగమాగం... గుట్టలుగా మృతదేహాలు

లాటిన్ అమెరికాలో అతిపెద్ద దేశంగా ఉన్న బ్రెజిల్ ఆగమాగం అయిపోయింది. కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీనికితోడు ఆ దేశ ప్రభుత్వం తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను అరకొరగా చేస్తోంది. దీనికితోడు ఈ వైరస్ బారినపడివారికి సరైన వైద్యం అందక అనేకమంది మృత్యువాతపడుతున్నారు. దీంతో బ్రెజిల్‌లో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. 
 
ఇబ్బడిముబ్బడిగా వస్తున్న మృతదేహాలతో శవాగారాలు, శ్మశానవాటికలు నిండిపోతున్నాయని సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రియోడిజెనీరో నగరంతో పాటు మరో నాలుగు ప్రధాన నగరాల్లో ఇప్పటికే అన్ని దవాఖానలు కొవిడ్‌-19 రోగులతో నిండిపోయాయి.
 
అలాగే, మిగిలిన ప్రదేశాల్లో కూడా మృతదేహాలు గుట్టలు గుట్టలుగా పడివున్నాయి. ఆస్పత్రుల్లో మార్చురీలు కూడా నిండిపోవడంతో వైద్యులు చేతులెత్తేస్తున్నారు. దీంతో మృతదేహాలను సామూహికంగా ఖననం చేస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ఇపుడు బ్రెజిల్ మృత్యుకుహరంగా మారిపోయింది. 
 
అలాగే, కొత్త కేసుల్ని చేర్చుకోలేమని రియో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన వర్గాలు ప్రకటనలు కూడా చేశాయి. కరోనా రోగులు కోలుకొని డిశ్చార్జి కావడం లేదా మరణించడం రెండింట్లో ఏదో ఒకటి జరిగితేనే కొత్త పేషెంట్లను చేర్చుకోగలమని పేర్కొంటున్నారంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 
 
మానాస్‌ నగరంలో ఒక శ్మశానవాటికలో కరోనా మృతుల కోసం పెద్దఎత్తున గోతులు తవ్వి సామూహిక ఖననాలు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. రోజూ వందకుపైగా మృతదేహాలను ఖననం చేస్తున్నట్టు తెలిపారు. మానాస్‌లో శవాలను తరలించే ఓ డ్రైవర్‌ మాట్లాడుతూ.. ఇటీవల తాను నిర్విరామంగా 36 గంటలు పనిచేశానని చెప్పారు. అయినప్పటికీ, కొత్త మృతదేహాలు వస్తూనే ఉన్నాయని, దీంతో తన యజమాని తనతో పాటు మరో డ్రైవర్‌ను నియమించుకున్నారని వివరించారు.