1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శనివారం, 14 ఆగస్టు 2021 (10:36 IST)

కాళ్ల‌కూరులో వేంక‌టేశ్వ‌రుని సేవ‌లో డిప్యూటీ సీఎం ధ‌ర్మాన‌

కాళ్లకూరులో ప్ర‌సిద్ధి గాంచిన వెంక‌టేశ్వ‌రుని సేవ‌లో ఏపీ డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణదాసు ఉద‌యమంతా గ‌డిపారు. పశ్చిమ గోదావరి జిల్లా 'కాళ్లకూరు'లో శ్రీ వేంకటేశ్వరుని మహమాన్విత క్షేత్రంలో పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసుకు ఆలయ మర్యాదలతో, పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.

ఈ ఆలయం పచ్చని పంట పొలాల మధ్య ఉంది. కాళ్ళ‌కూరులో ఈ క్షేత్రం కొలువై ఉండటం ఒక ప్రత్యేకత అయితే, ఇక్క‌డి వెంక‌టేశ్వ‌ర‌ స్వామివారికి తల వెనుక భాగంలో స్త్రీలకి వలె కొప్పు ఉండడం విశేషం. ఈ విధమైన రూపం దేశంలో మరెక్కడా లేదు. అదే విధంగా స్వామి వారి హృదయంలో లక్ష్మీ దేవి రూపం కనిపిస్తుంది. స్వామి వారికి కుడి ఎడమల్లో పద్మావతీ, ఆండాళ్ అమ్మ వార్లు దర్శనమిస్తారు.

ఈ స్వామి వారు కోరిన కోరికలను నెరవేరుస్తారని, పూజలేకాదు, భక్తులు భూములు ఇతర వసతులు కల్పిస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణం రంగు రంగుల పూలతో, పచ్చని మొక్కలతో శోభిల్లుతుంటుంది. ఈ ఆలయ ఆవరణలో మనోహరమైన ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమాచార్య విగ్రహం ఆహ్లాదంగా కనిపిస్తుంది.

ఇంతటి విశిష్టతలున్న ఈ ఆలయాన్ని భ‌క్తులు తప్పక సందర్శించవలసినదే అని ఏపీ డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణదాసు పేర్కొన్నారు. స్వామివారి చ‌ల్ల‌ని దీవెన‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మ‌న్నారు.