గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (08:38 IST)

నోబుల్ ప్రైజ్‌మ‌నీ ఎంతో తెలుసా...?

ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక అవార్డు అయిన నోబెల్‌ గ్రహీతలకు బహుమతితో పాటు ఇచ్చే నగదును ఈ ఏడాది 90 లక్షల క్రోనార్ల(స్వీడన్‌ కరెన్సీ) నుంచి కోటి కోనార్ల( భారత కరెన్సీలో దాదాపు రూ.8.13 కోట్లు)లకు పెంచనున్నట్లు నోబెల్‌ ఫౌండేషన్‌ వెల్లడించింది.

ఫౌండేషన్‌ ఆర్థిక సామర్ధ్యాన్ని బలోపేతం చేసేందుకు గత కొన్ని సంవత్సరాలుగా కృషి చేశామని, దీంతో నగదు బహుమతిని పెంచే వీలు కలిగిందని పేర్కొంది. ఈ ఏడాదికి సంబంధించి వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాల్లో నోబెల్‌ బహుమతులను అక్టోబర్‌ 5వ తేదీన ప్రకటించే అవకాశం ఉందని ఫౌండేషన్‌ ఈ సందర్భంగా తెలిపింది.

ఫౌండేషన్‌ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే కార్యాచరణ తీసుకున్న క్రమంలో 2011లో నగదు బహుమతిని కోటి క్రోనార్ల నుంచి 80 లక్షల కోనార్ల(రూ.8.13 కోట్ల నుంచి రూ.6.5 కోట్లు)కు తగ్గించారు. ఈ నేపథ్యంలో 2012 ప్రారంభం నుంచి ఫౌండేషన్‌ పెట్టుబడి మూలధనం రూ.2,439 కోట్ల నుంచి రూ.3,739 కోట్లకు పెరిగింది.

ఈ ఆదాయం పెరుగుదల సంవత్సరానికి తొమ్మిది శాతంగా ఉందని, మంచి మార్కెట్‌ పనితీరు, ఫౌండేషన్‌ ఆస్తుల నిర్వహణ మంచి ఫలితాలను ఇచ్చిందని ప్రకటన వెల్లడించింది. కాగా, స్వీడన్‌లోని స్టాక్‌హౌంలో ప్రతి ఏడాది సంప్రదాయంగా జరుగుతూ వస్తున్న నోబెల్‌ బహుమతుల ప్రదానం ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రద్దు చేశారు.

గ్రహీతలకు తమ సొంత దేశాల్లోనే టెలివైజుడ్‌ కార్యక్రమం ద్వారా బహుమతులను అందించేందుకు ఫౌండేషన్‌ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.