శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2019 (15:11 IST)

ప్లీజ్.. ఫోన్ ఇస్తారా.. అర్జెంటుగా అమ్మతో మాట్లాడాలి... మొబైల్ ఫోన్ ముఠా అరెస్టు

అర్జెంటుగా స్నేహితుడితో మాట్లాడాలి కొంచెం ఫోన్ ఇస్తారా? అని ముక్కూ ముఖం తెలియని వ్యక్తులు అడుగుతారు. అది నమ్మి మనం వారి చేతిలో ఫోన్ పెడతాం. మాటల్లో పడేసి దృష్టి మళ్లిస్తారు. ఏమరపాటులో ఉండగా దానిని తీసుకుని ఉడాయిస్తారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న పలు ముఠాలను పోలీసులు అరెస్ట్ చేసారు. 
 
ఒక చోటా రెండు చోట్లా కాదు, అనేక ప్రాంతాల నుండి ఫిర్యాదులు అందడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల నుండి ఆటో, ద్విచక్రవాహనం, 4 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. యాప్రాల్‌, బాలాజీనగర్‌కు చెందిన పల్లపు అనిల్‌కుమార్‌(27) ప్రైవేట్‌ ఉద్యోగి. అదే ప్రాంతంలోని పటేల్‌ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న వాసగోని అరుణ్‌కుమార్‌గౌడ్‌(23) సేల్స్‌మేన్‌. ఈ ఇద్దరూ ద్విచక్రవాహనం మీద తిరుగుతూ వచ్చే పోయే వ్యక్తుల వద్దకు వెళ్లి ఫోన్ మాట్లాడాలని చెప్పి ఫోన్ తీసుకుని అటు నుండి అటే ఉడాయిస్తున్నారు. 
 
అల్వాల్‌, బొల్లారం, బోయిన్‌పల్లి ఠాణాల్లో పలువురి నుండి ఫిర్యాదులు అందాయి. ఈ ఏడాది జనవరి 25న కానాజీగూడ కిరణాస్టోర్‌లో అశోక్‌ ఉండగా ద్విచక్ర వాహనంలో నిందితులు వెళ్లి ఫోన్ తీసుకుని ఉడాయించారు. జనవరి 29న బొల్లారంలో కొబ్బరి బొండాల విక్రేత దేవరాజ్‌ వద్దకు వచ్చి నమ్మించి అదే పని చేసారు. మార్చి 7న అర్థరాత్రి నిందితులు ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా తాడ్‌బండ్‌ ప్రాంతంలో కరుణాకర్‌ నడుచుకుంటూ వస్తున్నాడు. అతడి చరవాణిని తీసుకొని ఉడాయించారు. 
 
ఇలాంటిదే మరో ముఠా. కర్ణాటకకి చెందిన మహ్మద్‌ అర్బజ్‌(19) బంజారాహిల్స్‌ ఎన్‌బీనగర్‌లో నివసిస్తూ ఆటో నడుపుతున్నాడు. అదే ప్రాంతంలోఉండే మరో ఆటోడ్రైవర్‌ మహ్మద్‌ ముబిన్‌(23)తో అతడికి పరిచయం ఏర్పడింది. వీరి బాట కూడా ఫోన్‌లు తీసుకుని ఉడాయించడం. మార్చి 8న అర్థరాత్రి నారాయణ బేగంపేట్‌లోని సికాగోలో ఛాయ్ తాగుతున్న సమయంలో మహ్మద్‌ అర్బజ్, మహ్మద్‌ ముబిన్‌లు ఆటోలో వచ్చి ఫోన్ తీసుకుని ఉడాయించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను గాలం వేసి పట్టుకున్నారు.