శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 15 ఆగస్టు 2019 (13:10 IST)

మోడీ ఆట ప్రారంభించారు... అంతిమంగా యుద్ధమే : ఇమ్రాన్ ఖాన్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోమారు స్పందించారు. ఆర్టికల రద్దు 370ని రద్దు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఆట ప్రారంభించారనీ, అంతిమంగా యుద్ధం తప్పదని ఆయన హెచ్చరించారు. 
 
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ అసెంబ్లీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, కాశ్మీర్‌కు స్వాతంత్ర్యం సాధించేందుకు భారత్‌తో యుద్ధానికైనా తాము సిద్ధంగా ఉన్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ తన ఫైనల్‌ కార్డును ఉపయోగించారని.. అయితే ఇందుకు భారత్‌ తప్పక భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీజేపీ మాతృ సంస్థ ఆరెస్సెస్‌ ముస్లింలపై మూక దాడులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.
 
'కాశ్మీర్‌లో పౌరులపై జరుగుతున్న దాడులు, అక్కడ నెలకొన్న సంక్షోభం కారణంగా పడుతున్న కష్టాల గురించి మేము చింతిస్తున్నాం. భారత ప్రభుత్వం వ్యూహాత్మక తప్పిదం చేసింది. కాశ్మీర్‌ అంశంపై అంతర్జాతీయ సమాజం మాట్లాడకపోవచ్చు. కానీ కాశ్మీరీల తరఫున నేను మాట్లాడతాను. అన్ని వేదికలపై కాశ్మీర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌లా ఉంటాను. ప్రస్తుత విషయాల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో నేను మాట్లాడాను. అదే విధంగా ఇస్లామిక్‌ దేశాలతో కూడా చర్చిస్తాను' అని పేర్కొన్నారు. 
 
పైగా, తమ రెండు దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు మా సైనిక దళం శ్రమిస్తోంది. మన హక్కులు, స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. భారత్‌లో జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. పాక్‌ ఆర్మీ, ప్రజలు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నారు. కాశ్మీరీల హక్కుల ఉల్లంఘనలను ఎంతమాత్రం సహించబోము. భారత్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం అని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.