1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 ఫిబ్రవరి 2022 (14:30 IST)

జోక్యం చేసుకుంటే ఎంతకైనా తెగిస్తాం : ప్రపంచ దేశాలకు పుతిన్ వార్నింగ్

ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య మొదలైన ఘర్షణలు లేదా యుద్ధంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే తాము చూస్తూ ఊరుకోబోమని, ఎంతకైనా తెగిస్తామని ఉక్రెయిన్‌కు మద్దకు పలికే ప్రపంచ దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గట్టిగా హెచ్చరించారు. ఉక్రెయిన్ విషయంలో మద్దతు పలకాలని లేదా వకాల్తా పుచ్చుకోవాలని భావించే దేశాలకు తాను చెప్పే విషయం ఒక్కటేనని ఆయన తెగేసి చెప్పారు. 
 
"ఎవరైనా మా ఇరు దేశాల విషయంలో జోక్యం చేసుకోవాలని చూసినా, మా దేశాన్ని బెదిరించినా, మా ప్రజల భద్రతకు విఘాతం కలిగించినా తక్షణం మెరుపు వేగంతో స్పందిస్తాం. మేము ఇచ్చే బదులు ఎలా ఉంటుందంటే మీ జీవితంలో కనీ వినీ ఎరుగని, చూడని తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. 
 
ఈ విషయంలో మేం దేనికైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇప్పటికే అందుకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. అందువల్ల నా మాట వింటారని అనుకుంటున్నా అని పుతిన్ బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. అదేసమయంలో ఉక్రెయిన్ దేశాన్ని ఆక్రమించాలన్న ఉద్దేశ్యం లేశమాత్రం కూడా లేదన్నారు. 
 
కానీ, ఉక్రెయిన్‌లో జరుగుతున్న రక్తపాతానికి కారణం ఆ దేశ పాలకులేనని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లో డీ మిలటరైజేషన్ (నిస్సైనీకరణ) కోసమే తాము ప్రయత్నాలు మొదలుపెట్టామని, అందువల్ల ఆ దేశ సైనికులు ఆయుధాలు పడేసి ఇంటికెళ్లిపోవాలని ఆయన కోరారు. లేనిపక్షంలో చరిత్ర మరచిపోలేని భీకయ భయానక పరిస్థితులను చూస్తారని పుతిన్ హెచ్చరించారు.