1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Vance Lands in Switzerland for Iran Nuke Talks

కోడి ముందు పుట్టిందా లేక గుడ్డు ముందు పుట్టిందా అనే సమస్య లాంటిదే... జేడీ వాన్స్

Vance
Vance
పశ్చిమ ఆసియాలో శత్రుత్వాలకు ముగింపు పలకడం, అణు, ప్రాంతీయ భద్రతా అంశాలపై చర్చలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా 14 అంశాల అవగాహన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో, ఇరాన్‌తో సాంకేతిక స్థాయి చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్, సెకండ్ లేడీ ఉషా వాన్స్ శనివారం స్విట్జర్లాండ్‌కు బయలుదేరారు. 
 
లూసెర్న్ సమీపంలో జరగనున్న ఈ చర్చల్లో ఉపాధ్యక్షుడు పాల్గొననున్నారు. బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడిన వాన్స్, ఇరాన్ ప్రతినిధి బృందం ఇప్పటికే స్విట్జర్లాండ్‌కు చేరుకుందని, చర్చలు కొన్ని రోజుల పాటు కొనసాగవచ్చని తెలిపారు. అక్కడ రెండు రోజుల పాటు మాత్రమే వుంటానని, అణు సమస్య, లెబనాన్ కాల్పుల విరమణ అంశాలపై పురోగతి సాధించగలమని తాను ఆశిస్తున్నానని చెప్పారు. 
 
ఈ సందర్భంగా ఇరాన్‌కు కూడా కొన్ని అంశాలు చర్చించేందుకు వుంటాయని తెలుసునని వాన్స్ అన్నారు. ఇజ్రాయెల్ దాడులు, ప్రాంతీయ ఉద్రిక్తతల పట్ల ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ, అక్కడి పరిస్థితులు మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని వాన్స్ పేర్కొన్నారు. 
 
అక్కడ పరిస్థితులు వాస్తవానికి మెరుగుపడుతున్నాయి. ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. లెబనాన్‌లో జరుగుతున్న పరిణామాలను మార్కో, మొత్తం బృందం చురుకుగా పర్యవేక్షిస్తున్నారు. ఈ చర్చల ప్రధాన లక్ష్యం ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నివారించడం, ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడటమేనని వాన్స్ పేర్కొన్నారు. 
 
ఇజ్రాయెల్ మరియు లెబనాన్ రెండూ సురక్షితంగా ఉండేలా చూసుకోవడానికి మనం ఈ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. మొత్తం ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచడమే దీని వెనుక ఉన్న అసలు లక్ష్యం. 
 
"ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే, ఒకరు కాల్పులు జరపడం, దానికి మరొకరు ప్రతిస్పందించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక రకమైన కోడి ముందు పుట్టిందా లేక గుడ్డు ముందు పుట్టిందా అనే సమస్యలాంటిది. కాల్పుల విరమణ ఒప్పందం నిలకడగా కొనసాగేలా చేయడానికి, కొంతకాలం పాటు కాల్పులను ఆపాల్సి ఉంటుంది. మేము అదే చేయడానికి ప్రయత్నిస్తున్నాము.."అని వాన్స్ అన్నారు. 
 
ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ బుధవారం వర్చువల్‌గా అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని అంతం చేయడం, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలతో సహా విస్తృత సంప్రదింపులను ప్రారంభించడం ఈ ఒప్పందం లక్ష్యం. 
 
యాక్సియోస్ ప్రకారం, అమెరికా రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ ఇప్పటికే స్విట్జర్లాండ్‌లో ఉన్నారు. అక్కడ అణు ఒప్పందంపై మొదటి విడత చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అవగాహన ఒప్పందంలో అంతర్భాగమని ఇరాన్ పేర్కొన్న లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ, హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ సాయుధ దళాలు ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ ప్రతినిధి బృందం టెహ్రాన్ నుండి బయలుదేరింది. 
 
ఖతార్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ థానీ కూడా శుక్రవారం స్విట్జర్లాండ్‌కు చేరుకున్నారు. వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య సంభాషణలను సులభతరం చేసే కీలక మధ్యవర్తులలో ఖతార్ ఒకటిగా పరిగణించబడుతుంది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
స్నేహితులపై అసభ్య వీడియోలు- కేరళ బూతు వ్లాగర్ అరెస్ట్