శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (11:37 IST)

జియో ప్లాట్‌ ఫామ్స్ లిమిటెడ్ షేర్లలో ఫేస్‌బుక్ పెట్టుబడి

దేశ పారిశ్రామిక రంగానికి వెన్నెముకగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో ప్లాట్ ఫామ్స్ లిమిటెడ్‌లోని కొన్ని షేర్లను సోషల్ మీడియా దిగ్జజం ఫేస్‌బుక్ కొనుగోలు చేయనుంది. అంటే.. 9.99 శాతం వాటాను ఫేస్‌బుక్ సొంతం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుబడులు పెట్టనుంది. దీని విలువ రూ.43,574 కోట్లుగా ఉంటుందని అంచనా. 
 
కాగా, భారత్‌లో తమ డిజిటల్ ఆపరేషన్స్ పరిధిని మరింతగా విస్తరించుకోవాలన్న ఆలోచనలో ఉన్న ఫేస్‌బుక్, జియోలో భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపింది. వాస్తవానికి ఈ నెలాఖరులో ఫేస్‌‌బుక్‌‌తో ఈ డీల్ గురించి జియో ప్రకటిస్తుందని భావించినా, అంతకుముందే జియో దీనిపై మీడియా ప్రకటన విడుదల చేసింది.
 
దీని ప్రకారం, ఫేస్‌బుక్ పెట్టుబడి తర్వాత జియో ప్లాట్ ఫామ్స్ విలువ రూ.4.62 లక్షల కోట్లకు పెరిగినట్లవుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థగా, తదుపరి తరం టెక్నాలజీని దేశానికి అందిస్తూ, ఎన్నో డిజిటల్ యాప్స్‌ను అందిస్తున్న జియో, హై స్పీడ్ కనెక్టివిటీ ప్లాట్ ఫామ్‌గానూ సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ డీల్‌పై రిలయన్స్ అధిపతి ముఖేష్ అంబానీ స్పందిస్తూ, '2016లో మేము జియోను ఆవిష్కరించిన వేళ 'డిజిటల్ సర్వోదయ' కలను కన్నాం. డిజిటల్ సేవలు విస్తరిస్తే, ప్రజా జీవనం మెరుగుపడుతుందని భావించాం. ఇండియాను డిజిటల్ ప్రపంచంలో ముందు నిలపాలని అనుకున్నాం. ఆ కల నిజమయ్యే రోజిది. 
 
ఫేస్‌బుక్‌ను సాదరంగా జియోలోకి స్వాగతిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ మదిలోని డిజిటల్ ఇండియా మిషన్ ఆలోచన కూడా త్వరగా లక్ష్యాన్ని అందుకుంటుంది. కరోనా తర్వాత, ఇండియా ఆర్థిక వృద్ధి శరవేగంగా పెరుగుతుందని నేను నమ్మకంతో ఉన్నాను. ఈ రికవరీ అతి తక్కువ సమయంలోనే కళ్ల ముందు కనిపిస్తుంది' అని వ్యాఖ్యానించారు.