శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (14:22 IST)

వాట్సాప్‌ గ్రూప్‌ కాలింగ్‌లో కొత్త ఫీచర్.. ఇంకా పర్మినెంట్ మ్యూట్ ఆప్షన్..

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌ గ్రూప్‌ కాలింగ్‌లో ఇప్పటి వరకు ఎనిమిది మంది ఒకేసారి మాట్లాడుకునే సదుపాయం ఉంది. ఈ గ్రూప్‌ కాలింగ్‌లో ఎవరు మాట్లాడుతున్నా స్క్రీన్‌పై అందరి ముఖాలు ఒకే సైజులో కనిపిస్తాయి. దానివల్ల ఎవరైతే మాట్లాడుతున్నారో వారిపై దృష్టిపెట్టడానికి అవకాశం ఉండదు. ఇక మీదట మాట్లాడే వ్యక్తిని హైలెట్ చేసే విధంగా కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది వాట్సాప్‌. 
 
ఇందుకోసం గ్రూప్‌ వీడియో కాల్‌లో మాట్లాడే వ్యక్తి విండోపై ప్రెస్‌ చేసి హోల్డ్ చేస్తే వారి విండో పెద్దదిగా కనపడుతుంది. దాంతో మిగతావారి దృష్టి సదరు వ్యక్తిపైనే ఉంటుంది. అలానే గ్రూప్‌లో ఉన్న వారితో (ఎనిమిది మంది మాత్రమే) వీడియో కాల్‌ చేసేందుకు కొత్తగా వీడియో ఐకాన్‌ను యాడ్ చేసింది.
 
అలాగే ఎప్పుడో వాట్సాప్‌లో టైప్‌ చేసిన మెసేజ్‌, ఫొటో, వీడియో లేదా డాక్యుమెంట్ కావాలి. కానీ దానిని వెతకాలంటే అయ్యే పని కాదు. అందుకే వాట్సాప్‌ అడ్వాన్స్‌ సెర్చ్‌ ఫీచర్‌ను తీసుకొస్తోంది. దీనిద్వారా యూజర్స్‌ గతంలో పంపిన మెసేజ్‌, ఫొటో, వీడియో, డాక్యుమెంట్లను సులభంగా వెతకవచ్చు.
 
ఇంకా మనలో చాలామంది ఒకటి కంటే ఎక్కువ వాట్సప్‌ గ్రూపుల్లో సభ్యులుగా ఉండే ఉంటారు. వాటిలో కొన్ని మనం తరచుగా ఉపయోగించేవి అయితే, మరికొన్నింటిలో సభ్యులుగా ఉన్నప్పటికీ చురుగ్గా వ్యవహరించం. అటువంటి వాటిని మ్యూట్‌లో పెడుతుంటాం. 
 
అయితే మ్యూట్ ఫీచర్‌లో ఇప్పటి దాకా ఎనిమిది గంటలు, ఒక వారం, ఏడాది పాటు మ్యూట్ చేసుకునే అవకాశం మాత్రమే ఉంది. ఇక మీదట పూర్తిగా అంటే మీరు అన్‌మ్యూట్ చేసేవరకు గ్రూప్‌ నోటిఫికేషన్స్‌ను మ్యూట్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్.