1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: గురువారం, 27 ఆగస్టు 2020 (13:53 IST)

కోవిడ్ ఆస్పత్రిలో మహిళ మృతి, ఐదు తులాల బంగార ఆభరణాలు మాయం

కరోనా చికిత్స పొందుతూ ఓ మహిళ మరణించింది. ఆమె శరీరంపై ఉన్న 5 తులాల బంగార ఆభరణాలు మాయమైన ఘటన శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలో జరిగింది. మండలం లోని ఓ గ్రామానికి చెందిన మహిళ కరోనా బారిన పడి నెల్లిమర్లలోని మిమ్స్ ఆస్పత్రిలో చేరింది. అక్కడ చికిత్స  పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఇంటికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు.
 
ఈ క్రమంలో మృతదేహంపై కప్పిన కవర్‌ను తొలగించి చూడగా, ఆమె శరీరంపై ఉండాల్సిన బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో వారు ఆందోళనకు దిగారు. బాధిత మహిళ బంధువుల ఆరోపణలపై జిల్లా కోవిడ్ ఆస్పత్రి ప్రత్యేక వైద్యాధికారి హరికిషన్ సుబ్రమణ్యం స్పందించారు. ఆస్పత్రిలో మృతురాలి బంగారు నగలు పోయేందుకు అవకాశం లేదని, అన్ని గదుల్లోను సీసీ కెమరాలు ఉన్నాయని తెలిపారు.
 
నిజానికి కరోనా భయంతో ఎవరు దగ్గరికి వెళ్లే పరిస్థితి కూడా లేదని తెలిపారు. మృతదేహాన్ని బంధువులు తరలించే సమయంలో ఏదో పొరపాటు జరిగి ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యానికి తెలియజేస్తామని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు చేస్తే విచారణ చేపడుతామని నెల్లిమర్ల పోలీసులు తెలిపారు.