Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?
గద్దర్ అవార్డుకు ఎంపికైన సినిమాలను అన్నింటినీ పారదర్శకంగా ఇవ్వాలని మనస్సాక్షికి అనుగుణంగా అవార్డు ఎంపిక జరగాలని ఎఫ్.డి.సి. ఛైర్మన్ దిల్ రాజు మీడియా ముందు తెలిపారు. అనుకున్నట్లుగానే అవార్డుల లిస్ట్ నాముందు పెట్టినప్పుడు వారిలో నిజాయితీ కనిపించింది అని ఆయన తెలిపారు. అయితే దీనిపై ఓ దర్శకుడు మాత్రం గద్దర్ పేరు అవమానం జరిగిందనీ, జ్యూరీ కమిటీలో ఎంపికైన సినిమాలకు పనిచేసిన వారే వుండడం చిత్రంగా వుందనీ, చాలా సినిమాలు చూడకుండా గుడ్డిగా చూసినట్లు సంతకాలు పెట్టారని తెలియజేస్తున్నారు.
అవార్డుల ప్రకటన అనంతరం దర్శకుడు సయీద్ రఫీ ఓ ప్రకటనలో తెలియజేస్తూ, గద్దర్ అవార్డ్స్ కోసం అప్లై చేసిన సినిమాల్లో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నిషన్స్ సెలక్షన్ కమిటీ జ్యూరీ మెంబర్స్ గా కూడా ఉండడం, కమిటీ వేసిన వారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. సభ్యులందరూ కలిసి మొత్తం సినిమాలను వీక్షించకుండానే, హాజరు అయినట్లు సంతకాలు పెట్టి వెళ్లిపోవడం, పట్టు పట్టి మరీ ఒక సినిమాకు అవార్డు వచ్చేలా ఒత్తిడి తేవడం పారదర్శకమా? తెలంగాణ ప్రజా ధనం వృధా. వీరి నిర్ణయం, ప్రజా యుద్ధ నౌక గద్దర్ కి పెద్ద అవమానం. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రభుత్వం జాగ్రత పడవలసిన సందర్భం ఇది అంటూ పేర్కొన్నారు. గతంలో ఇలాంటి అవార్డులు ప్రభుత్వం ప్రకటిస్తే, వెంటనే కొన్ని ప్రముఖ ఛానల్స్ చర్చోపచర్చలు పెట్టేవి. కానీ ఇప్పుడు వారుకూడా మిన్నకున్నారు. కారణం కమిటీ ఛైర్మన్ కూ ఛానల్స్ యాజమాన్యానికి సత్ సంబంధాలు వుండడమేనని వార్తలు వినిపిస్తున్నాయి.