శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 25 ఆగస్టు 2020 (14:10 IST)

ఏపి బిజేపికి సోషల్ మీడియా టెన్షన్, సోము వీర్రాజుపైన పోస్టులు

సోము వీర్రాజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అద్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత దూకుడు పెంచారు. పార్టీ వేదికలు, పలు టీవీ చానెల్స్ ఇంటర్వ్యూలు సందర్భంలో పార్టీ లైన్‌ను కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్నారు. ఈ వ్యవహారం పార్టీలో కొంత చిచ్చు రేపినా వీర్రాజును ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి ఉంది.
 
ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మీద విరుచుకు పడుతున్నారు. గత రెండు దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీని చంద్రబాబు వ్యూహాత్మకంగా దెబ్బకొట్టారని, దీనికి చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సోము వీర్రాజు చెబుతూ వస్తున్నారు. తాజాగా సోము వ్యాఖ్యలతో టిడిపికి చెందిన వర్గాలు గుర్రుగా ఉన్నాయి. దీంతో సోషల్ మీడియాలో సోము వీర్రాజు, ఎంపి జివిల్ పైన విమర్శలు గుప్పిస్తూ పోస్టులు పెట్టారు.
 
కొన్ని రాజకీయ విమర్శల వరకే ఉండగా కొన్ని పోస్టులు మాత్రం తీవ్ర అభ్యంతరకరంగా ఉంటున్నాయి. అయితే ఇవన్నీ టిడిపి స్పాన్సర్డ్ పోస్టులుగా భావిస్తున్న బిజెపి రాష్ట్ర నాయకత్వం వీటిని సీరియస్‌గా తీసుకుంది. ఇలాంటి పోస్టులపై ఆదిలోనే చర్యలుకు దిగకపోతే... అదుపు చెయ్యలేమని పార్టీ నేతలు బావిస్తున్నారు. దీంతో ఎంపి జివిఎల్ పైన పోస్టులు పెట్టిన వారిపై గంటల వ్యవధిలోనే పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
 
స్థానిక నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో మంగళగిరిలో కేసు కూడా నమోదు చేశారు. ఇదిలా ఉండగానే... సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని సహించేది లేదని బిజెపి ఒక ప్రకటన విడుదల చేసింది. బహిరంగం హెచ్చరిక పేరుతో వచ్చిన ఈ ప్రకటనలో తాము నకిలీ, తప్పుడు పోస్టులపై ఎలా వ్యవహరించబోతున్నామో కూడా చెప్పారు.