గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 అక్టోబరు 2022 (12:04 IST)

వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే : విప్రో ఆదేశాలు

Wipro
కరోనా మహమ్మారి తర్వాత ఐటీ ఉద్యోగుల వర్కింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. గత రెండు మూడు సంవత్సరాలుగా ఇంటిపట్టునుంచే కొలువులు చేస్తున్నారు. అయితే, పలు కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులను ఆఫీసులకు రావాల్సిందేనంటూ నిక్కచ్చిగా తేల్చి చెబుతున్నాయి. ఈ క్రమంలో టెక్ దిగ్గజం విప్రో తమ ఉద్యోగులకు ఓ సూచన చేసింది. వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాలని కోరింది. ఈ విషయాన్ని ఇ-మెయిల్‌ ద్వారా మంగళవారం వారికి తెలియజేసింది. 
 
అక్టోబరు పదో తేదీ నుంచి కార్యాలయాలు తెరిచి ఉంటాయని తెలిపింది. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో.. ఏదైనా మూడు రోజులు ఆఫీసుకు రావొచ్చని తెలిపింది. బుధవారం మాత్రం కార్యాలయాలు మూసి ఉంచుతున్నట్లు తెలిపింది. హైబ్రిడ్‌ పని విధానాన్ని కొనసాగిస్తూనే ఉద్యోగుల మధ్య అనుబంధం, బృందస్ఫూర్తిని పెంపొందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
 
అయితే, విప్రో నిర్ణయంపై జాతీయ ఐటీ రంగ ఉద్యోగుల సంఘం నైట్స్‌ (NITES) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా ఉన్నఫళంగా ఆఫీసుకు రమ్మని పిలవడం సమంజసం కాదని పేర్కొంది. కనీసం నెల సమయం ఇవ్వాల్సిందని అభిప్రాయపడింది. తద్వారా ఉద్యోగులు కావాల్సిన ప్రాంతాలకు చేరుకొని అక్కడ సర్దుబాటు కావడానికి సరిపడా సమయం లభించేదని తెలిపింది. పైగా, ఉద్యోగుల మనోభావాలను తెలుసుకోకుండా ఇలాంటి ప్రకటన చేయడం భావ్యం కాదని పేర్కొంది.