1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (10:12 IST)

ఐటీ రిటర్నుల దాఖలు గడువు ముగిసింది.. చివరి రోజున..

e-return
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్‌) దాఖలుకు ఆఖరి రోజైన ఆదివారం ఒక్కరోజులోనే రాత్రి 11 గంటల వరకు 67,97,067 రిటర్నులు దాఖలైనట్లు ఆదాయ పన్ను విభాగం వెల్లడించింది. 
 
శనివారం వరకు 5.10 కోట్లకు పైగా దాఖలైన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 12 గంటల సమయానికి దాదాపు 5.83 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్టు సమాచారం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, పొడిగించిన గడువు తేదీ 2021 డిసెంబరు 31 వరకు చూస్తే దాదాపు 5.89 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. 
 
అంటే గతేడాదితో పోలిస్తే ఈసారి గడువు పొడిగించనందున 6 లక్షల మంది జరిమానాతో ఐటీఆర్‌ దాఖలు చేయాల్సి వస్తుంది. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 19.53 లక్షలు దాఖలయ్యాయి. తదుపరి ప్రతి గంటకు 4 లక్షలకు పైగా.. సాయంత్రం 5-6 గంటల మధ్య అత్యధికంగా 5.17 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి.
 
మరోవైపు, 2021-22కు సంబంధించి అపరాధ రుసుము లేకుండా జులై 31లోగా ఐటీఆర్‌లు దాఖలు చేయాలి. తదుపరి డిసెంబరు 31 వరకు అపరాధరుసుముతో దాఖలు చేయొచ్చు. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు రూ.1000, అంతకుమించిన ఆదాయం గలవారు రూ.5000 చొప్పున అపరాధ రుసుము చెల్లించి, ఐటీఆర్‌ దాఖలు చేసుకునే వెసులుబాటును కల్పించింది.