గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (15:15 IST)

జనవరి 18, 2021 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్.. విప్రో ప్రకటన

Wipro
కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టడంతో కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు మళ్లీ యధావిథిగా కంపెనీలకు రావాలని కోరుతున్నాయి. మరికొన్ని రోజులు ఇదే విధంగా పని చేసే అవకాశం కల్పిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఐటీ దిగ్గజం విప్రో కూడా చేరిపోయింది.
 
భారత్‌తో పాటు అమెరికాలో ఉన్న తమ ఉద్యోగులంతా జనవరి 18, 2021 వరకు వర్క్ ఫ్రమ్ హోం ద్వారానే సేవలందించాలని విప్రో వెల్లడించింది. ఈ కంపెనీలో విధులు నిర్వహించే ఉద్యోగుల్లో ఎక్కువ మంది భారత్, అమెరికాలోని వారే. భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఇక అమెరికాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కొనసాగిస్తున్నట్లు విప్రో కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఈ మెయిల్‌ద్వారా ఉద్యోగులకు చేరవేసింది. మరోవైపు మిగతా దేశాల్లో విధులు నిర్వహించే తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం పొడిగించే అంశాన్ని ఆయా దేశాల్లో కరోనా పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని కంపెనీ ప్రకటించింది. ఉద్యోగుల ఆరోగ్యమే తొలి ప్రాధాన్యమని కంపెనీ వెల్లడించింది.
 
మరోవైపు భవిష్యత్తులో ఉద్యోగులంతా ఆఫీసుకి వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉండకపోవచ్చునని విప్రో ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ కొన్ని నెలల క్రితం జరిగిన ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కంపెనీ మరోసారి వర్క్ ఫ్రమ్ హోం గడువును పొడిగించడం విశేషం.
 
ఇదిలా ఉంటే మార్చిలో లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి ఐటీ సంస్థలు విప్రో, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌టెక్‌ వంటి సంస్థలు.. తమ ఉద్యోగుల్లో 90 శాతం మందిని వర్క్ ఫ్రమ్ హోం చేయాలని సూచించాయి. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. పరిస్థితి ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో చాలా కంపెనీలు ఇంకా వర్క్ ఫ్రమ్ హోం విధానమే మేలు అనే భావిస్తున్నాయి.