మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (17:17 IST)

వాగు భూమిని కబ్జా చేసి టీడీపీ ఆఫీసును నిర్మించారా? సుప్రీంకోర్టు ఏమన్నది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయ ఉంది. ఇది గత తెదేపా హయాంలో అన్ని సొబగులతో నిర్మించారు. అయితే, ఈ కార్యాలయం నిర్మించిన భూమి వాగు భూమి అని వైకాపాకు చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రధాన ఆరోపణ. వాగు భూమిని కబ్జా చేసి టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని నిర్మించారంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. జస్టిస్ నారిమన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. పిటిషనర్ తరపున ప్రశాంత్ భూషణ్, రమేశ్ వాదనలు వినిపించారు. జల వనరులతో సంబంధం ఉన్న భూమిని పార్టీ ఆఫీసుకు కేటాయించారని వారు కోర్టుకు తెలిపారు. 
 
అంతేకాకుండా, టీడీపీ ప్రధాన కార్యాలయానికి భూకేటాయింపుల విషయంలో సీఆర్డీయే నిబంధనల ఉల్లంఘన జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం 3.65 ఎకరాల వాగు భూమిని కబ్జా చేసి పార్టీ ఆఫీసు నిర్మాణం జరిపారని చెప్పారు. దీంతో మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ ఏపీ సర్కారుకు, తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేసింది. అప్పటివరకు విచారణ వాయిదా వేసింది.
 
కాగా, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో టీడీపీ జాతీయ కార్యాలయం ఉంది. ఇప్పటికే దీనిపై ఆర్కే రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో, న్యాయం జరగలేదని భావించి సుప్రీంను ఆశ్రయించారు.