1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2020 (19:37 IST)

లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు

కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుండటంతో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. లాక్‌డౌన్‌ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా సూచించారు.

ప్రాణాంతక వైరస్‌ విస్తృతంగా ప్రబలకుండా అడ్డుకట్ట వేసేందుకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. లాక్‌డౌన్‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోడ్లపైకి వచ్చే వారికి చెక్‌ పెట్టాలని కోరారు.
 
డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు స్పష్టం చేశారు. ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు చేపట్టవచ్చనే పూర్తి వివరాలతో కూడిన జాబితాను కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు పంపింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1965కు చేరగా వీరిలో 151 మంది కోలుకోగా 50 మంది మరణించారు.
 
15న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారా..?
దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో... అన్ని రంగాలు తీవ్ర నష్టాలను ఎదర్కొంటున్నాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ ను మరికొన్ని రోజుల పాటు పొడిగించే అవకాశం ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి.

వీటిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏప్రిల్‌ 15 న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారా..? లేదా అనే ప్రశ్న అనేక మందిలో ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలో గురువారం ప్రధాని నరేంద్ర మోడి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

ఈ సమావేశం అనంతరం అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేమాఖండూ చేసిన ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది. ప్రధానితో సమావేశం అనంతరం పేమాఖండూ ట్వీట్‌ చేస్తూ... ఏప్రిల్‌ 15 న లాక్‌డౌన్‌ను ఎత్తివేయనున్నట్లు తెలిపారు. కానీ ప్రజలంతా బయటకు రావడానికి కొన్ని పరిమితులు మాత్రం ఉంటాయని పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌ ఎత్తివేసినా.. సామాజిక దూరంతో మాత్రమే కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించగలమని వివరించారు. సిఎం ట్వీట్‌తో ఏప్రిల్‌ 15 న లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారని అర్థమవుతోంది.