శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (16:13 IST)

వచ్చే మార్చి నాటికి కోవిడ్ వ్యాక్సిన్:కేంద్రం

క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తయితే వచ్చే ఏడాది మార్చి నాటికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్‌ కుమార్‌ చౌబే వెల్లడించారు. రాజ్యసభలో ఆదివారం సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.

కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారీ కోసం దేశంలో ఆరు సంస్థలకు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఐ) అనుమతించినట్లు మంత్రి చెప్పారు.

అనుమతి పొందిన తయారీదారులలో పూనేకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, జెనోవా బయోఫార్మాస్యూటికల్స్‌, అహ్మదాబాద్‌కు చెందిన కాడిలా హెల్త్‌కేర్‌, హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌ ఈ, అరబిందో ఫార్మా, ముంబైకి చెందిన రిలయన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఉన్నట్లు తెలిపారు.

ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మరో 30 వరకు వ్యాక్సిన్‌ పరిశోధనలకు సాయపడుతున్నట్లు చెప్పారు.

కోవిడ్‌ 19 టెస్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ ఒకటని మంత్రి వెల్లడించారు. సెప్టెంబర్‌ 18 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 10 లక్షల జనాభాకు 85,499 మందికి కోవిడ్‌ -19 టెస్ట్‌లు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు.

అలాగే కోవిడ్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌, హెల్త్‌ సిస్టమ్‌ ప్యాకేజి కింద రెండు దశలలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు 200 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.