1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (16:27 IST)

ఢిల్లీలో సంపూర్ణ లాక్ డౌన్‌ రంగం సిద్ధం.. సుప్రీంలో విచారణ

దేశ రాజధాని నగరం ఢిల్లీలో సంపూర్ణ లాక్ డౌన్‌కు రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఢిల్లీలో అవసరమైతే సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించడానికి సిద్ధమని అక్కడి ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెల్లడించింది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై సోమవారం సుప్రీం కోర్టులో అత్యవసర విచారణ జరిగింది.
 
ఈ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. వ్యవసాయ వ్యర్థాల దహనం వల్ల కేవలం 10 శాతం మాత్రమే కాలుష్యం వస్తోందని కోర్టుకు వెల్లడించారు. కేంద్రం వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి ఒక ప్రణాళికను కోర్టుకు అందజేసింది. 
 
దీనిలో స్టోన్‌ క్రషర్లను, కొన్ని రకాల విద్యుత్తు కర్మాగారాలను నిలిపివేయడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను దహనం చేయడాన్ని ఆపివేయడం వంటివి ఉన్నాయి. వీటిని అమలు చేస్తే కొంత ఫలితం ఉంటుందని కోర్టుకు వెల్లడించారు.
 
మరోవైపు అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం కోర్టుకు ప్రమాణ పత్రం సమర్పించింది. దీనిలో ఢిల్లీతో పాటు నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో కూడా కఠిన నిబంధనలు అమలు చేయాల్సి ఉందని పేర్కొంది. లాక్‌డౌన్‌ మాత్రమే తక్షణం కొంత మేరకు ప్రభావం చూపించగలదని తెలిపింది.