1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (16:47 IST)

ఢిల్లీని వణికిస్తున్న డెంగ్యూ జ్వరం.. వారం రోజుల్లో 2569 కేసులు

దేశ రాజధాని ఢిల్లీని ఒక వైపు కాలుష్యం వణికిస్తుంది. ఇపుడు కొత్తగా డెంగ్యూ ఫీవర్ విజృంభణ కొనసాగుతుంది. దీనికి నిదర్శనమే గత వారం రోజుల వ్యవధిలో కొత్తగా 2,569 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దీంతో వారం రోజుల్లోనే డెంగ్యూ కేసుల మొత్తం సంఖ్య రెట్టింపైంది. 
 
ఈ యేడాది ఇప్పటివరకు మొత్తం 5,277 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 9 మరణాలు సంభవించినట్లు చెప్పారు. గత 2015 తర్వాత ఢిల్లీలో నమోదైన డెంగ్యూ కేసులు, మరణాల్లో ఇదే గరిష్ట సంఖ్యగా ఢిల్లీ అధికారులు చెబుతున్నారు. 
 
గత 2015లో మొత్తం 16,000 మంది డెంగ్యూ బారినపడగా సుమారు 60 మంది మరణించారు. 2016లో 4,431, 2017లో 4,726, 2018లో 2,798, 2019లో 2,036 డెంగ్యూ కేసులు నమోదు కాగా 2020లో కేసుల సంఖ్య 50 శాతం వరకు తగ్గి 1,072 నమోదయ్యాయి.
 
మరోవైపు ఢిల్లీలో ఈ ఏడాది డెంగ్యూ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటివరకు 5,277 కేసులు నమోదు కాగా, ఇందులో ఒక్క నవంబర్‌లోనే 3,740 కేసులు రికార్డయ్యాయి. దీంతో ఆసుపత్రులకు డెంగ్యూ రోగుల తాకిడి పెరిగింది. 
 
లోక్ నాయక్ ఆసుపత్రిలోని 100 పడకల ఫీవర్ వార్డు 90 శాతం నిండిపోయింది. ఆసుపత్రిలో ప్రతిరోజూ 20 నుండి 30 మంది డెంగ్యూ రోగులు చేరుతున్నారని ఈ నెల 13న ఒక సీనియర్ వైద్యుడు చెప్పడం పరిస్థితికి అద్దం పడుతుందని వైద్యాధికారులు చెబుతున్నారు.