మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 25 జులై 2020 (09:21 IST)

27న సీఎంలతో మళ్లీ మోడీ వీడియో కాన్ఫరెన్స్!

కరోనా నియంత్రణ రోజురోజుకు కష్టసాధ్యమైపోతున్న తరుణంలో మునుముందు ఏం చేయాలన్నదానిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో సమాలోచనలు జరపాలని నిర్ణయించారు. ఇందుకోసం సీఎంలతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 
 
ఈ సమావేశం ఈ నెల 27న జరుగుతుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత కాలంలో దేశంలో కరోనా ఉధృతితో పాటు 3.0 అన్‌లాక్ పరిస్థితులపై కూడా కూలంకశంగా చర్చించనున్నారు. 
 
కరోనా తీవ్రత, లాక్‌డౌన్ మొదలవగానే ప్రధాని మోదీ మార్చి మాసంలో మొట్ట మొదటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజాగా జూన్ 16,17 తేదీల్లో... వరుసగా రెండు సార్లు అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
 
ఈ కాన్ఫరెన్స్‌లో కరోనా తీవ్రత, ఆయా రాష్ట్రాలు చేపడుతున్న చర్యలతో పాటు లాక్‌డౌన్ సడలించిన తర్వాతి పరిస్థితులపై సీఎంలతో మోదీ చర్చించిన విషయం తెలిసిందే. 
 
శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 49 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. అంతేకాకుండా దేశంలో త్వరలోనే రోజు లక్ష కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో ఐసీయూ పడలకు, వెంటిలేటర్ల కొరత తీవ్రగా ఉన్నట్లు సమాచారం.