మంగళవారం, 29 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 జులై 2025 (15:42 IST)

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

operation mahadev
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం ఉగ్రదాడిలో పాలుపంచుకున్న ఉగ్రవాదులను ఏరివేసే పనిలో భారత బలగాలు నిమగ్నమైవున్నాయి. ఇందుకోసం 'ఆపరేషన్ మహదేవ్‌'ను చేపట్టి.. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న పలువురు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేసింది. 
 
పహల్గాం‌లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన వచ్చిన పక్కా సమాచారంతో దాచిగామ్‌లో భద్రతా బలగాలు సోదాలు చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు సమాచారం. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. పహల్గాం ఉగ్రవాదులను తుదముట్టించే లక్ష్యంతో ఆపరేషన్ మహదేవ్ చేపట్టినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భద్రతా బలగాలతో పాటు జమ్మూకాశ్మీర్ పోలీసులు పాల్గొన్నారు. 
 
ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చినట్టు సమాచారం. ఈ ముగ్గురు ఉగ్రవాదులూ పహల్గాంలో దాడికి పాల్పడినవారేనని భావిస్తున్నారు. అయితే, ఈ విషయంపై భద్రతా బలగాల నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సివ ఉంది. ఒకవైపు పార్లమెంట్‌లో ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ జరుగుతుండగా మరోవైపు పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ చేయడం గమనార్హం. అది కూడా పహల్గాం ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా ఆపరేషన్ చేపట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.