1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 9 మే 2025 (01:32 IST)

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

Operation Sindoor 2
భారతదేశంలోని సరిహద్దు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలపై దాడి చేసేందుకు పాకిస్తాన్ మిసైళ్లు, డ్రోన్లు, ఫైటర్ జెట్లతో ముందుకు దూసుకు వచ్చింది. అంతే... భారతదేశ S400 ఆటోమెటిక్ రాడార్ వ్యవస్థ వాటిని గగనతలంలోనే సర్వనాశనం చేసింది. మరోవైపు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పైన దాడి చేసేందుకు పాకిస్తాన్ తన ఫైటర్ జెట్లతో విశ్వప్రయత్నం చేసింది. ఈ ఫైటర్ జెట్లను భారతసైన్యం కూల్చివేసింది. ఈ విమానాల్లో ఒక విమానంలో బతికిబయటపడ్డ పాకిస్తాన్ పైలెట్‌ను భారతదేశ సైన్యం ప్రాణాలతో పట్టుకున్నది. 
 
పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడటంతో భారతదేశ త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. వాయుసేన, నౌకాదళం, సైనికదళం ఒక్కసారిగా పాకిస్తాన్ పైన విరుచుకుపడ్డాయి. INS విక్రాంత్ అరేబియా సముద్ర తీరాన వున్న కరాచీ పోర్టును నామరూపాల్లేకుండా పేల్చి వేసినట్లు వీడియో దృశ్యాలు చూపుతున్నాయి.
 
పాక్ 3 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం
జమ్మూ: గురువార రాత్రి 8:15 గంటల ప్రాంతంలో, పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో జమ్మూపై దాడి చేసింది. రక్షణ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, పాకిస్తాన్ చేసిన ఈ దుష్ట దాడిని భారత సైన్యం తిప్పికొట్టింది. ఆర్ఎస్ పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దుపై పాకిస్తాన్ సైన్యం భారీ కాల్పులు ప్రారంభించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే అఖ్నూర్, సాంబా, పఠాన్‌కోట్‌లను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఇలాంటి క్షిపణి, డ్రోన్ దాడులను చేసిందా లేదా అనేది ఇంకా నిర్ధారించబడలేదు. కాగా పాకిస్తాన్ కు చెందిన JF17 ఫైటర్ జెట్లను మూడింటిని భారత్ కూల్చేసింది.
 
పాకిస్తాన్ నుండి ఈ క్షిపణి, డ్రోన్ దాడులు జరిగిన వెంటనే, జమ్మూలో బ్లాక్అవుట్ విధించబడింది. జమ్మూ నగరం, జమ్మూ విమానాశ్రయం వైపు కదులుతున్న క్షిపణులు, డ్రోన్లను సకాలంలో కూల్చివేసినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ దాడిలో ఏదైనా ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగిందా లేదా అనే దానిపై ప్రస్తుతానికి ఎటువంటి నిర్ధారణ లేదు.
 
పాకిస్తాన్ స్వార్మ్ డ్రోన్‌లను ఉపయోగించిందని, వాటిలో రెండింటిని జమ్మూ నగరం నడిబొడ్డున ఉన్న జమ్మూ విశ్వవిద్యాలయం సమీపంలో కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ ఈ దాడి కోసం S-400ను ఉపయోగించారని, దీనిని పూర్తిగా ఓడించామని రక్షణ అధికారులు తెలిపారు. డ్రోన్ దాడులను అడ్డుకోవడానికి స్వదేశీ డ్రోన్ వ్యతిరేక ఆయుధాలను ఉపయోగించారు. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఇప్పటికీ బ్లాక్‌అవుట్ ఉంది. అలారం సైరన్‌లు నిరంతరం మోగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యం ఆర్ఎస్ పురాలోని అంతర్జాతీయ సరిహద్దుపై భారీ షెల్లింగ్ ప్రారంభించిందని, రాజౌరి పట్టణంలోకి కూడా ఫిరంగి గుండ్లు పడ్డాయని వార్తలు అందుతున్నాయి.