మంగళవారం అర్థరాత్రి 1.44 గంటలకు ఆపరేషన్ సిందూర్ స్టార్ట్ (Video)
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో జరిగిన నరమేధానికి భారత్ ప్రతికార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్థరాత్రి 1.44 గంటలకు ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్తో పాటు పాక్ ఆక్రమిక కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి.
మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్థాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్రపన్నినట్లు భావిస్తున్న మొత్తం తొమ్మిది స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లు తెలిపింది. ఉద్రిక్త పరిస్థితులకు తావులేకుండా.. పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది.
దేశ వ్యాప్తంగా బుధవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆపరేషన్ సిందూర్పై పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. 'ఆపరేషన్ సిందూర్' అనంతరం 'భారత్ మాతా కీ జై' పేరుతో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.