Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు
విద్యార్థులను పొట్టనబెట్టుకున్న పాక్ సైనికులు
జమ్మూ: ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor)కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ సరిహద్దులోని ఎల్ఓసీ భారతదేశ పౌరులపై పాకిస్తాన్ సైన్యం జరిపిన భారీ షెల్లింగ్లో 16 మంది భారతీయ పౌరులు మరణించారు. 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పాక్ సైనికులు ప్రత్యేకించి పాఠశాలపై దాడులు చేసారు. దీనితో ఇద్దరు విద్యార్థులతో సహా మొత్తం 16 మంది మృతి చెందారు. భారతదేశం- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, జమ్మూ మరియు కాశ్మీర్ హజ్ కమిటీ నేడు, రేపు జరగాల్సిన రెండు హజ్ విమానాలను అధికారికంగా రద్దు చేసింది.
సెలవులో ఉన్న పారామిలిటరీ దళాల అధిపతులను తమ సిబ్బందిని వెనక్కి పిలిపించాలని హోంమంత్రి అమిత్ షా బుధవారం ఆదేశించారని అధికారులు తెలిపారు. ఆపరేషన్ సిందూర్కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ సరిహద్దులోని ఎల్ఓసీపై పాకిస్తాన్ సైన్యం జరిపుతున్న భారీ షెల్లింగులతో ఎల్ఓసీని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో భయానక దృశ్యాల మధ్య వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోతున్నారు. కొంతమంది ధైర్యం కూడగట్టుకుని బంకర్లలో దాక్కున్నారు, డిప్యూటీ గవర్నర్ మనోజ్ సిన్హా అంతర్జాతీయ సరిహద్దులోని జీరో లైన్ దగ్గర ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారతదేశం పాకిస్తాన్లోకి ఖచ్చితమైన వైమానిక దాడులు నిర్వహించిన తరువాత జమ్మూ కాశ్మీర్లోని అనేక ప్రాంతాలలో ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కాల్పుల్లో 16 మంది పౌరులు మరణించగా, 150 మందికి పైగా గాయపడ్డారని రక్షణ అధికారులు తెలిపారు. పూంచ్, మెంధార్ సెక్టార్లలోని ఎల్ఓసీ వెంబడి పాకిస్తాన్ సైనికులు కాల్పుల జరిపారు. ఉరిలోని సలామాబాద్లోని నౌపోరా, కల్గే ప్రాంతాలలో సరిహద్దు కాల్పుల్లో పది మంది పౌరులు గాయపడ్డారని, రాజౌరిలో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించారు.
పాకిస్తాన్ సైన్యం వరుసగా 13వ రోజు కూడా ఎల్ఓసీ వెంబడి భారీ మోర్టార్, ఫిరంగి దాడులను చేపట్టిందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 2021లో భారతదేశం- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జమ్మూ- కాశ్మీర్లోని ఎల్ఓసి వెంబడి జరుగుతున్న భారీ కాల్పులు ఇవే మొదటిసారిగా జరుగుతున్నాయి.