1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (08:55 IST)

‘అతిపెద్ద అల్లర్ల సృష్టికర్త’ మోడీ : మరో ట్రంప్ అవుతారు.. మమతా హెచ్చరిక

ప్రధాని నరేంద్ర మోడీకి టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టి హెచ్చరిక చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత డోనాల్డ్ ట్రంప్‌కు ఎదురైన పరాభవమే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధాని మోడీకి ఎదురవుతుందని ఆమె జోస్యం చెప్పారు. 
 
గతవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించిన హుగ్లీ జిల్లా సహగంజ్‌లో బుధవాకం మమత బహిరంగ సభ నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. ‘అతిపెద్ద అల్లర్ల సృష్టికర్త’గా మోడీని అభివర్ణించారు. 
 
అమిత్ షా, మోడీ ఇద్దరూ కలిసి అసత్యాలను ప్రచారం చేస్తూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మోడీ అవకాశవాది అని, అల్లర్ల సృష్టికర్త అని ఆరోపించిన మమత.. కోట్ల రూపాయలకు దేశాన్ని అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
 
టీఎంసీ కమీషన్లు (కట్ మనీ) తీసుకుంటుందని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు మరి దీనినేమంటారని ప్రశ్నించారు. క్యాట్ మనీ అంటారా? లేక, ర్యాట్ మనీ అంటారా? అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించి మరోమారు అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.