ఇస్రో శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు : కేంద్రం ఆరా
భారతీయ అంతరిశక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన శాస్త్రవేత్తలు వరుసగా తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. ఇది దేశంలో పెను చర్చనీయాంశంగా మారింది. దాదాపు 100 మంది శాస్త్రవేత్తలు వరుసగా రాజీనామాలు చేయడంతో కేంద్రం ఉలికిపాటుకు గురైంది. దీంతో కేంద్రం రంగంలోకి దిగింది. గత కొన్ని నెలల్లోనే 100 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా చేయడం లేదా స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ పరిణామంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం, కీలక శాస్త్రవేత్తలను సంస్థలోనే నిలుపుకునేందుకు చర్యలు చేపట్టింది. గగన్యాన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తల రాజీనామాలను, వీఆర్ఎస్లను పరిమితం చేస్తూ అంతరిక్ష విభాగం ఇటీవలే కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం దేశ అంతరిక్ష కార్యక్రమాలకు నిపుణుల సేవలు ఎంత కీలకమో చెబుతున్నప్పటికీ, అసలు శాస్త్రవేత్తలు ఇస్రోను ఎందుకు వీడుతున్నారనే పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది.
ఇస్రో శాస్త్రవేత్తల వలసల వెనుక అనేక కారణాలున్నాయని అంతరిక్ష రంగ నిపుణులు, సంస్థలోని సీనియర్ అధికారులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా దేశంలో వేగంగా విస్తరిస్తున్న ప్రైవేట్ అంతరిక్ష రంగం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 2020లో ప్రైవేట్ భాగస్వామ్యానికి తలుపులు తెరిచిన తర్వాత స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్, ధ్రువ స్పేస్ వంటి స్టార్టప్ కంపెనీలు భారత ఏరోస్పేస్ ముఖచిత్రాన్ని మార్చేశాయి. ఈ సంస్థలు రాకెట్లు, ఉపగ్రహాలు, ప్రొపల్షన్ సిస్టమ్లను వేగంగా అభివృద్ధి చేస్తున్నాయి.
ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వ సంస్థలతో పోలిస్తే మెరుగైన జీతాలు, స్టాక్ ఆప్షన్లు, పనిలో సౌలభ్యం వంటివి అందిస్తున్నాయి. అంతేకాకుండా స్టార్టప్లలో యువ శాస్త్రవేత్తలకు సైతం నాయకత్వ బాధ్యతలు త్వరగా లభించడంతో పాటు వినూత్న టెక్నాలజీలను నిర్మించే అవకాశం దొరుకుతోంది. గతంలో ఇస్రోలో ఉన్నత పదవుల్లో పనిచేసి రిటైర్ అయిన పలువురు నిపుణులు ఇప్పుడు ప్రైవేట్ స్టార్టప్లకు మార్గనిర్దేశం చేస్తుండటం కూడా ఈ వలసలకు ఊతమిస్తోంది.
