బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి
బాసరలో సరస్వతీ మాత దర్శనానికి వెళ్లి భక్తులు ప్రమాదవశాత్తూ గోదావరి నదిలో మునిగిపోయారు. స్నానం చేసేందుకు వెళ్లిన ఐదుగురు గల్లంతయ్యారు. ఇందులో నలుగురి మృతదేహాలను వెలికితీశారు. మరొకరి కోసం నదిలో గాలిస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రం వద్ద ఆదివారం ఉదయం ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
నదిలో స్నానానికి దిగిన భక్తులు గల్లంతవడం చూసి అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన నది వద్దకు చేరుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్ల సాయంతో రెస్క్యూ చేపట్టారు. స్థానిక అధికారులు కూడా అక్కడకు చేరుకున్నారు.
గజ ఈతగాళ్లు నలుగురు మృతదేహాలను ఒడ్డుకు చేర్చగా, మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు. కాగా, మృతులంతా హైదరాబాద్ నగరంలోని దిల్సుఖ్ వాసులుగా గుర్తించారు. పైగా, వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని అధికారులు తెలిపారు.